20, జనవరి 2012, శుక్రవారం

తెలుగు కుత్తుకపై కత్తి



ఆంధ్ర ప్రదేశ్ అధికార భాషా సంఘం పూర్వ అధ్యక్షులు .బి.కె.ప్రసాద్ గారు సాక్షి దినపత్రికలో 20.1.2012 "తెలుగు కుత్తుకపై కత్తి అనే వ్యాసం లో వెలిబుచ్చిన కొన్ని అభిప్రాయాలుః
" నేడు మన పాలకులు తెలుగుకు పట్టిస్తున్నతెగులును చూస్తుంటే ఎన్నెన్నో ఘోరాలు కళ్లముందు కదలాడుతాయి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్నగ్రూప్-I’ పరీక్షలలో అనుసరిస్తున్న తీరు తెలుగు మాధ్యమం అభ్యర్థులను నిరుత్సాహ పరిచే విధంగా ఉండటం తెలుగు మాధ్యమ అభ్య ర్థులకే కాదు, భాషాభిమానులకు, ప్రాచీన భాషా ప్రతిపత్తిని ఆధికారికంగా పొందిన తెలుగు ఉనికిపట్ల ఆందోళనపడుతున్న భాషా ప్రియులందరికీ ఆగ్రహ కారణమవుతోంది.
ఇంగ్లిష్ ప్రశ్నల్ని ఊతంగా తీసుకుని తెలుగు మాధ్యమం అభ్యర్థులకు తప్పుడు అనువాద పదాలతో కూడిన ప్రశ్నపత్రాలు ఇచ్చి, సమాధాన పత్రా లను మూల్యాంకనం చేయడం వల్లనే తెలుగు అభ్యర్థులుఎక్కువ మార్కులు పొందలేక ఇంటర్వ్యూలకు అనర్హులు కావడం దారుణం. అనువాద లోపాల్ని కమిషన్ తీవ్రంగా పరిగణించకపోవడం విచారకరం.
తెలుగువాడు రాష్ట్ర ప్రభుత్వోద్యోగాలకు సైతం తెలుగు మాధ్యమంలో చదివి తెలుగు మాధ్యమంలో పరీక్షలు రాయడాన్నీ, తెలుగు మాధ్యమాన్ని ఎంచుకోవడాన్నీ మహాపాపంగాను, మహా నేరంగానూ భావించే దశకు రాష్ట్ర పాలనా వ్యవస్థ దిగజారిపోయింది.
తెలుగు మాధ్యమంలో పరీక్షలు రాసే ఉద్యోగార్థులైన అభ్యర్థుల పట్లనే వివక్ష దేనికి? మూడేళ్ల క్రితం వరకూ తెలుగు మాధ్యమంలో విద్యాభ్యాసం చేసి గ్రూప్-I పరీక్షలలో అట్టడుగు వర్గాలకు చెందిన అభ్యర్థులు సైతం టాపర్స్గా వచ్చారు .తెలుగు ప్రథమ అధికార భాషగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ సర్వీసులలోకి రాగోరే అభ్యర్థు లకు నిర్వహించే పరీక్షలలో ప్రశ్నపత్రాలు, సమాధాన పత్రాలలో అవక తవకలు దేనికి?
రాష్ట్ర పాలక వర్గానికి, ఇరుగు పొరుగు రాష్ట్రాలలోని ప్రభు త్వాలు విద్యావ్యవస్థలోనూ, ఉద్యోగ వ్యవస్థలోనూ
తమ మాతృభాషలను ఎలా పెంచి పోషించుకుంటున్నాయో గ్రహింపు ఉండవలసినంతగా లేదు. కనుకనే
మన విద్యావ్యవస్థలోనూ, పాలనా వ్యవస్థలోనూ, తెలుగు వినియోగపు విలువను కాపాడుకోలేక పోతున్నారు.కర్ణాటక ప్రభుత్వం, ఉద్యోగార్థులకు కన్నడ భాషాజ్ఞానాన్ని, వినియోగ పాటవాన్నీ విధిగా ప్రకటించడమేగాక,ఇంజనీ రింగ్, మెడిసిన్ విద్యా దశల్లో సహితం మాతృభాషతో స్పర్శ కోల్పోకుండా ఉంచుతోంది.పొరుగు వాణ్నిచూసైనా మన పాలకులు విద్యావ్యవస్థలో మాతృభాష స్థానాన్ని స్పష్టంగా నిర్వచించి స్థిరపరచాలి.తెలుగు ప్రజలకిదే గుణపాఠం! బోధనా పరంగానూ, పాలనా పరంగానూ మాతృభాషను చక్కదిద్దుకోవలసిన అవసరం ఎప్పటికన్నా నేడు ఎక్కువగా ఉందన్న గ్రహింపు అవశ్యం, అవసరం! గుర్తింపునకు ముందు జాతికి జీవగర్రలు ప్రజా హృదయాలేనన్నయాదిపాలకులకు నిద్రలో కూడా తన్నుతూ ఉండాలి! అన్యభాషలను గౌరవించడంతో పాటు తల్లి భాషను ఒంటపట్టించుకోవడం ఎలాగో నేర్వాలి, నేర్పాలి!
"కొమర్రాజు లక్ష్మణరావు గారి దేశభాషలలో శాస్త్ర పఠనం అనే వ్యాసంలో శాస్త్రపఠనానికి కొన్ని భాషలు మాత్రమే అర్హమైనవన్న వాదాన్ని తీవ్రంగా ఖండిస్తూ "జ్ఞానమొక భాషయొక్క యబ్బ సొమ్ము కాదు" అన్నాడు. "ఆంగ్లభాషపై అభిమానమున్నయెడల ఆ భాషను క్షుణ్ణముగా అధ్యయనము చేయవచ్చును, కాని కమ్మరము, కుమ్మరమును అదేభాషలో చదువవలసిన అవుసరమేమున్నది?" అన్నాడు. ఈ విషయములో జర్మనులు మనకు ఆదర్శము కావలెనన్నాడు.

అలాగే ఔరంగజేబు తన గురువునకు ఉపయోగకరమైన విద్యావసరాల గురించీ, అదీ స్వభాషలోనే జరగాలనీ వ్రాసిన ఉత్తరాన్ని లక్ష్మణరావు పారశీక భాషనుండి తెలుగులోకి అనువదించి ఇలా వ్యాఖ్యానించాడు:

"బాలబాలికలకు బోధింపబడు విషయములు వారికి, వారి జీవితకాలములో నుపయోగకరముగానుండవలయును. కేవలము పాండిత్యము జూపుటకై అనుపయోగకరములగు విషయములు వారికి నేర్పి గుడ్డిపాఠముచేయించి కాలము వ్యర్థపుచ్చుట, వారికిని, దేశమునకును హానిప్రదము. బాలురకు శాస్త్రములన్నియు వారి మాతృభాషలోనే నేర్పవలయునుగాని పరభాషలో నేర్పుట కేవలము ద్రావిడప్రాణాయామమని ఔరంగజేబు ఉత్తరము వలన మనవారు ముఖ్యముగా నేర్చుకొనవలయును. మొదట పరభాషనభ్యసించుటకు బాలుర కాలమెంతయో వ్యర్థమగును. అట్లు పరభాషవచ్చిన తరువాత, ఆభాషలో శాస్త్రములనభ్యసించుటకంటె మొదటనుండియు స్వభాషలోనే శాస్త్రాధ్యయనము చేసిన యెడల బాలురకెంతయో కాలము, శ్రమయు కలిసివచ్చును కదా? తెలివిగల పిల్లవానికి ఇంగ్లీషుభాష చక్కగ నభ్యసించుటకు సుమారు ఆరేడు సంవత్సరములు పట్టును. అప్పటికా బాలునకు ఇంగ్లీషులో గ్రంథావలోకనము చేయుటకును, శాస్త్రాభ్యాసము చేయుటకును అధికారము కల్గును. ఇట్లు పరభాషాధ్యయనమునకై ఏడెనిమిది సంవత్సరములు వ్యర్థమగుచున్నవి. దేశ భాషలలో శాస్త్రములు జెప్పిన యెడల నీ ఏడెనిమిది సంవత్సరములలో నెన్నియో విద్యలలో పారంగతుడు కావచ్చును.... కాని సకల శాస్త్రజ్ఞానమును, ఇంగ్లీషుభాషయను గదిలోబెట్టి తాళమువైచి, ఏ.బి.సి.డి. అను తాళపుచెవిని సంపాదించుటకు ఎనిమిది సంవత్సరములు ముక్కు పట్టుకొని తపస్సు చేయనివారలకు జ్ఞానభాండారములోని సొత్తును కొల్లగొట్టునధికారము లేదనియు, విద్యామహిమయు మాతృభాషాప్రభావమును తెలియని దూరదృష్టి విహీనులు తప్ప మరెవ్వరును చెప్పజాలరు.... ఇంగ్లీషుభాషనే జ్ఞానసాధనముగా బెట్టిరేని ఔరంగజేబు తన గురువును నిందించినట్లు రాబోవుతరమునందలి విద్యార్థులు తమ యాయుష్యములోని పది సంవత్సరములు పాడుచేసినందులకు మనలను నిందింపక మానరు".
--(1910 - భారతి మాసపత్రిక , సాధారణ సంవత్సరాది సంచిక)
నా అభిప్రాయం:
*తెలుగు మీడియం ద్వారా డిగ్రీ చదివిన అభ్యర్దులకు పూర్వం ఇచ్చిన పద్ధతిలోనే మళ్ళీ అయిదు శాతం ప్రోత్సాహక మార్కులు ఇస్తే తెలుగులో చదివే విద్యార్ధులు పెరుగుతారు.
*సర్వీస్ కమీషన్ ఇన్నిరకాల పరీక్షలకు బదులు డిగ్రీ అర్హత గల గ్రూప్ I,II ఉద్యోగాలన్నిటికీ కలిపి ఒకే పరీక్ష (స్టేట్ సివిల్ సర్వీసెస్ ఎక్జామ్) ప్రతి ఏటా నిర్వహించి అందులో అభ్యర్ధులకు వచ్చిన మార్కులను బట్టి పోస్టులు కేటాయిస్తే ఖర్చు ఇద్దరికీభారీగా తగ్గుతుంది.సమయమూ కలిసి వస్తుంది.
*తెలుగు మొదటి అధికార భాష కాగా ఉర్దూ రెండవ అధికార భాష మన రాష్ట్రంలో.తెలుగు నుండి ఇంగ్లీషుకు,ఉర్దూ నుండి ఇంగ్లీషుకూ నిఘంటువులున్నాయి గానీ ఇద్దరు అన్నదమ్ములు పరస్పరం తెలుగు-ఉర్దూ,ఉర్దూ-తెలుగు నిఘంటువులు నిర్మించుకోలేదు.రెండూ దేశ భాషలే.రాష్త్రం ఏర్పడి ఇన్నేళ్ళయినా ఒకరి భాష ఒకరికి సరిగా రాదు.
*
ఉర్దూ-తెలుగు నిఘంటువు 1938 లో వరంగల్ ఉస్మానియా కాలేజీలో అరబిక్ ప్రొఫెసర్ .కొండలరావు సంకలనపరచి ప్రచురించిన పురాతన ప్రతిని తెలుగు అధికార భాషా సంఘంఏబికెప్రసాద్ గారికి 6.10.2008 న అందజేశాను.2009 ఏప్రిల్ 25 తేదీన 862 పేజీలతో ఈనిఘంటువును పునర్ముద్రించి అధికార భాషా సంఘం అధ్యక్షుడు ఏబికెప్రసాద్ గారు విడుదల చేశారు.తెలుగు-ఉర్దూ నిఘంటువు గురించి ఆయన పదవీ విరమణానంతరం ఇప్పటికి కూడా ఆరా తీస్తున్నారు.
*ఎన్నో ఉర్దూ పదాలు,ఇంగ్లీషు పదాలు తెలుగు ప్రజల అనుదిన జీవిత సంభాషణల్లో పాతుకుపోయి ఉన్నాయి.అనువాదం చేసే ప్రొఫెసర్లు పండితులు ప్రజలకు అర్ధం కాని కృత్రిమ భాషా పదాలను సృష్టించే కంటే ప్రజలలో పాతుకుపోయిన పర భాషా పదాలనే వాడితే మన తెలుగు విద్యార్ధులను కాపాడిన వారౌతారు.
*ప్రాచీన భాషా పీఠం మన రాష్ట్రం లోనే పెడతారు కాబట్టి దానికి వచ్చే నిధులతో మహా నిఘంటువు,జాతీయాలు,సామెతల గ్రంధాలు ముద్రించాలి.
*పోటీ పరీక్షల్లో తెలుగు విద్యార్ధులకు ఉపయోగపడే సూచనలు సలహాలు ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి ఇస్తూ ఉండటానికి అమలుచేయడానికి ప్రత్యేక యంత్రాంగం,మంత్రాగం ఏర్పడాలి.

స్వామీ కావ్య రచన మీకు సంస్కృతంలో అలవాటుగా?
మరి ఈ ఆముక్త మాల్యదను తెలుగులో వ్రాస్తున్నారే?
తెలుగదేలయన్న దేశంబు తెలుగు
యేను తెలుగు వల్లబుండ తెలుగొకండ
ఎల్లనృపులు గొలువ ఎరుగవే బాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స
అని ఆంధ్ర దేవుని ఆనతి
మన భాషకు రాయల నాటి ఇలాంటివైభవం మళ్ళీ వస్తుందా?

1 కామెంట్‌: