27, మే 2016, శుక్రవారం

ప్రభుత్వ కార్యాచరణ విధాన పత్రం రూపకల్పన కోసం నేను సమర్పించిన అభిప్రాయాలు

విజయవాడ సాహితీ సాంస్కృతిక సంస్థలు మరియు ఎన్.టి.ఆర్.ట్రస్ట్ ఆధ్వర్యంలో 31.5.2016 న జరిగే తెలుగు భాషా సాంస్కృతిక సమ్మేళనం లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా జరగవలసిన కృషిని, చేపట్టవలసిన కార్యాచరణను సూచిస్తూ విధాన పత్రం రూపకల్పన కోసం నేను సమర్పించిన అభిప్రాయాలు :
2012 ప్రపంచ తెలుగు మహాసభల్లో చేసిన తీర్మానాలు ప్రకటించిన విధానాలు చూస్తే తెలుగు ప్రాణం పోసుకొని తిరిగి లేస్తుందనిపించింది.కాల గమనంలో మన ఆశలు నీరుగారిపోయాయి.2016 లో నాలుగేళ్ళ తరువాత జరిగే తెలుగు భాషా సమ్మేళనం లో కూడా మళ్ళీ ఇంచుమించు అవే అంశాలపై సూచనలు అన్వేషిస్తున్నాం .
ఇంగ్లీషు చదువువల్ల,విదేశాల్లో కొలువులవల్ల డబ్బు సంపాదన విపరీతంగా ఉంది కాబట్టే అటు జనం పరుగులు పెడుతున్నారు.ఇక్కడే ఉండి దేశ ప్రజలకే సేవ చెయ్యండి,విదేశాలకు పోకండి అని వావిలాల,కాళోజీ,సత్యసాయిబాబా లాంటి మహనీయులు ఎంతగా చెప్పినా ఎవరూ వినలేదు.వినటం లేదు. వినరుకూడా.కారణం ఏంటంటే తెలుగు మాత్రమే చదివితే ఉద్యోగాలు రాని పరిస్థితి ఉంది.తెలుగు భాష ద్వారా కూడా ఉద్యోగాలూ,డబ్బు వస్తుంటే అప్పుడు కొందరైనా స్వార్ధం కొంత చంపుకొని తెలుగు చదువుతారు.భాషతో సాంకేతిక,ఆర్ధిక విషయాలను ముడిపెట్టకుండా అభివృద్ధి సాధ్యంకాదు. ఏ జాతి సమస్త వ్యవహారాలు ఆ జాతి మాతృ భాషలోనే జరుగుతాయో ఆ జాతి సుఖపడుతుంది.అది ఎప్పటికీ విజేతగానే ఉంటుంది. భాష పేరుతో ఐక్యత కోరే వాళ్ళు ఆ భాషను బ్రతికించటానికి కూడా కృషి చెయ్యాలి. భాష చచ్చిపోతే ఇక ఈ భాషా నినాదం కూడా చేయలేము.
నా సూచనలు :
1. మన రాష్ట్రంలో తెలుగు మొదటి అధికార భాష కాగా ఉర్దూ రెండవ అధికార భాష. ఈ రెండు భాషల ప్రజల మధ్య వారివారి భాషా పదాల పరిచయం, అవ గాహన, మరింత పెరగటానికి నిఘంటువులు ఎంతగానో తోడ్పడతాయి. ఉర్దూ- తెలుగు నిఘంటువు, ఉర్దూ-తెలుగు జాతీయాలు, తెలుగు-ఉర్దూ సామెతలు లాంటి పుస్తకాలు ఎక్కడా అమ్మకానికి దొరకడంలేదు. ముద్రించాల్సిన అవసరంఉంది. ముషాయిరాల కంటే ముఖ్యమైన తెలుగు-ఉర్దూ, ఉర్దూ తెలుగు నిఘంటువులు కావాలి. తెలుగు జాతీయలూ, నుడికారాలూ, పదబంధాలూ కూర్చిన నిఘంటువుల అవసరం ఉంది . తెలుగు ప్రాచీన భాషా పీఠం తెలుగు ప్రాంతానికి తరలిరావాలి.తెలుగు మహా నిఘంటువు, జాతీయాలు, సామెతలు, జానపదగీతాలు, పాత చిత్రాలలోని పాటలు మొదలైన సాహిత్య గ్రంథాలు ముద్రించాలి.ఎన్ని ఎక్కువ తెలుగు నిఘంటువులు నెట్‌లో చేరితే తెలుగు అంతగా బలపడుతుంది.ఆధునిక అవసరాలకు ధీటుగా తెలుగు భాష తయారు కావాలి. ఇంగ్లీషులో ఉన్న సౌలభ్యాలన్నీ తెలుగుకూ కల్పించాలి. పదాల శుద్ధి`యంత్రం, గుణింత, వ్యాకరణ పరిష్కారయంత్రం, సాంకేతిక నిఘంటువులు, మాండలిక నిఘంటువులు, డిజిటల్‌నిఘంటువులు, అమరకోశాలు, పదశోధనా యంత్రాలు, ఉచ్ఛారణ పద ప్రయోగ నిఘంటువులు, వ్యుత్పత్తి కోశాలు, లిపిబోధినిలు, సాహిత్య శోధనా పరికరాలు, పదాను క్రమణికలు... ఇలా ఎన్నో రావాల్సిన అవసరం ఉంది. ఆన్‌లైన్‌లోనే నిఘంటువులకు కొత్త పదాలను జోడించే అవకాశం అందరికీ ఇవ్వాలి. ఏయే ప్రాంతాల్లో ఏ పదాన్ని ఎందుకు, ఎలా వాడుతుంటారో ఆయా ప్రాంతాల ప్రజలనే చెప్పనివ్వాలి. సరిగా ఉన్నట్లు భావించిన కొత్త పదాలను ఎప్పటికప్పుడు నిఘంటువుల్లో చేరుస్తూ పోవాలి. మన నిఘంటువుల సైజు పెరగాలి. అవి జన బాహుళ్యానికి వాడకంలోకి విస్తారంగా వస్తూనే ఉండాలి.
2. వక్ఫ్‌బోర్డు నిఖా నామాలు (వివాహ ధ్రువపత్రాలు) తెలుగు భాషలో కూడా ప్రచురించాలి. మన రాష్ట్రంలో తెలుగు మాతృభాషగల 'తెలుగు ముస్లిములు' లక్షలలో వున్నారు. నిత్యం ఉర్దూ మాట్లాడే ముస్లింలలో కూడా పలువురికి ఉర్దూ చదవడం, రాయడం రాదు. వీరంతా తెలుగులోనే రాతకోతలు సాగిస్తుంటారు. ఉర్దూ రాని ముస్లింలకు కూడ వివాహ ధృవీకరణ (నిఖానామా) పత్రాలను ఉర్దూలోనే జారీ చేస్తున్నారు. తెలుగు ముస్లిముల సౌలభ్యం కోసం ఖాజీలు తెలుగులోనే నిఖా ప్రసంగాలు చేస్తున్నారు. ఖురాన్‌, హదీస్‌వంటి మూల గ్రంథాలన్నిటిని తెలుగులో ముద్రించారు. అలాగే వివాహ ధృవీకరణ పత్రాలను కూడ తెలుగులో ముద్రించి ఇస్తే తెలుగులోనే పూరించి ఇస్తామని ఖాజీలు అంటున్నారు. కాబట్టి వక్ఫ్‌బోర్డు వివాహ ద్రువపత్రాలను తెలుగు భాషలో కూడా ప్రచురించాలి.
3 . తెలుగులో ఉత్తమ సాఫ్ట్ వేర్ లు తయారుచేసిన సాంకేతిక నిపుణులకు,తెలుగు భాషకు ఉపకరించే సులభ ఉపకరణాలను తయారు చేసిన సాంకేతిక పరిజ్నానులకు తెలుగు వైతాళికుల పేరు మీద ప్రోత్సాహక బహుమతులు ఇవ్వాలి.తర్జుమా పరికరాల తయారీ ప్రారంభదశలో ఉంది గనుక కొన్ని తప్పులు వస్తున్నాయి.అనువాద ఉపకరణాలు, నిఘంటువులు, లెక్కకు మిక్కిలిగా రావాలి. ఆన్‌లైన్‌లోనూ ఆఫ్‌లైన్‌లోనూ వాటిని విరివిగా లెక్సికన్లు వాడుకునే సౌలభ్యాలు కలగాలి.యంత్రానువాదాలకూ, లిప్యంతరీకరణకూ, విషయాలకు ఆకారాది సూచికలను తయారు చేయటానికీ, వెతకటానికి అనుకూలంగా తెలుగులో కంప్యూటర్‌ వాడకం పెరగాలి.
4 . తెలుగు మీడియంలో కంప్యూటర్‌ చదువులు కూడా రావాలి. అలా చదివిన డిగ్రీ విద్యార్థులకు పోటీ పరీక్షల్లో ప్రోత్సాహకాలు ప్రకటిస్తే తెలుగు చాలాకాలం బ్రతుకుతుంది. గ్రూప్‌ 1, గ్రూప్‌ 2 సర్వీసు ఉద్యోగాలలో డిగ్రీ తెలుగు మీడియంలో చదివిన వారికి గతంలో ఇచ్చిన మాదిరే 5% ప్రోత్సాహక మార్కులు ఇస్తే, తెలుగులో కార్యాలయ వ్యవహారాలు నడిపే వాళ్ళు రంగప్రవేశం చేస్తారు. కొంతవరకైనా ఆఫీసుల్లో తెలుగు బ్రతుకుతుంది. తెలుగు విూడియంలో చదివితే ఉద్యోగా లొస్తాయన్న ఆశతో కొంత మందైనా తెలుగులో చదువుతారు. తెలుగులో చదివిన అధికారులు కార్యాలయాల్లో జరిగే పనులన్నిటికీ ''కొత్తపదాలు'' పుట్టిస్తారు. తెలుగు పదకోశాలు అమలవుతాయి. పరిపాలనకు పనికొచ్చే శాస్త్రీయ తెలుగు తయారవుతుంది. అధికార భాషగా తెలుగును అమలు చేయాలనే పట్టుదల, ఆకాంక్ష ఉంటే తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థుల్ని ప్రోత్సహించి అధికారులుగా చేయాలి. కేవలం తెలుగు మీడియంలో మాత్రమే చదివిన వాడికి ఇంగ్లీషురాక పోయినా ఎటువంటి శాస్త్ర సాంకేతిక రంగంలోనయినా ఉద్యోగం గ్యారంటీగా వస్తుందనే వాతావరణం కల్పించాలి. అంటే ఇంగ్లీషు రాకపోయినా కలెక్టరు , డాక్టరు , ఇంజనీరు కాగలిగే విధంగా మన విద్యా వ్యవస్థ మారాలి! అప్పుడు జనం తండోపతండాలుగా తెలుగులో చదువుతారు. తెలుగు మీడియంలో చదివిన విద్యార్ధులకు సర్వీసుకమీషను పరీక్షల్లో రిజర్వేషన్లో, ప్రోత్సాహక మార్కులో తిరిగి ఇప్పించటానికి కృషి చేస్తామని చేసిన ప్రకటన ప్రభుత్వ ఉత్తర్వుగా రావాల్సిఉంది.
5 . రాష్ట్ర అధికార బాషా సంఘం మాజీ అధ్యక్షుడు ఏబికె ప్రసాద్‌గారు ప్రభుత్వానికి కొన్ని మంచి సిఫారసులు చేసారు. (ఈనాడు: 19-5-2005).అందులో ఈనాటికీ అమలు కానివి: 1) తెలుగు మీడియంలో చదివిన వారికి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఇవ్వాలి. 2) ప్రైవేటు, కార్పోరేట్‌ పాఠశాలల్లో కూడా అన్ని స్థాయిల్లో పదో తరగతి వరకు తెలుగు మీడియం ఉండాలి. 3) వ్యాపార సంస్థలు,దుకాణాలన్నీ తెలుగులో బోర్డులు ఏర్పాటు చేయకపోతే వాటి లైసెన్సులు రద్దు చేసే అధికారం కన్నడ అధికార భాషా సంఘానికి ఉన్నట్లుగా, తెలుగు అధికార భాషా సంఘానికి కూడా ఉండాలి.4 ) తమిళనాడులో తెలుగు మాట్లాడే వాళ్ళు రెండవ స్థానంలో ఉన్నందున ఆ రాష్ట్రంలో తెలుగును రెండవ అధికార భాషగా ప్రకటించాలి. 5 ) రాజ్యాంగంతో సహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చట్టాలను వాడుక బాషలోకి తేవాలి. 6 ) ఎనిమిదో షెడ్యూల్లో పేర్కొన్న బాషలన్నిటినీ అప్పటికప్పుడు తర్జుమా చేసే విధంగా పార్లమెంటులో ఏర్పాటు చేయాలి. 7 ) స్థానిక న్యాయస్థానంలో తీర్పులు అధికార భాషలో ఉండేలా చర్యలు తీసుకోవాలి. 8 ) మండల స్థాయి నుండి సచివాలయం వరకు అధికార భాషను అమలు చెయ్యని అధికారులపై చర్యలు తీసుకునే అధికారం అధికార భాషా సంఘానికి ఇవ్వాలి.
6 . తెలుగు విశ్వవిద్యాలయం, అధికార భాషా సంఘం, తెలుగు అకాడవిూ, అన్ని విశ్వవిద్యాలయాల్లోని తెలుగు విభాగాలు కలసికట్టుగా కృషిచేసి ఏయేటికాయేడు అవి తెలుగు భాషాభివృద్ధి కోసం ఏంచేశాయో, ఏం సాధించాయో ప్రగతి నివేదికలను తెలుగు ప్రజలకు బయటపెట్టాలి. ఈ సంస్థలన్నీ ప్రజల నుండి సూచనలు తీసుకోవాలి. పరిపాలక గ్రంథాలు కోడ్లు, మాన్యువల్‌లు, లాంటివన్నీ తెలుగులో ప్రచురించి అన్ని కార్యాలయాలకు పంపాలి. సర్వీస్‌కవిూషన్‌ పోటీ పరీక్షలు, శాఖాపరమైన పరీక్షలు తెలుగులో నిర్వహించాలి. కూడిక, తీసివేత లాంటి తెలుగు పదాలకు బదులు సంకలనం, వ్యవకలనం లాంటి సంస్కృత పదాలను వాడి తెలుగు మీడియం అంటే పిల్లలు భయపడేలా చేశారు. పిల్లల పుస్తకాలు వాడుక తెలుగుతో చెయ్యాలి.
7 . తెలుగును రెండవ జాతీయ భాషగా ప్రకటించాలి. మన ప్రజల భాషలోనే జీవోలు రావాలి. అప్పుడే తెలుగు అధికార భాషగా విరాజిల్లుతుంది.తెలుగు భాష మాట్టాడేవాళ్ళ సంఖ్యనుబట్టి, జనబలాన్ని బట్టి పార్లమెంటులో మన గౌరవం మనకు దక్కుతుంది. హిందీతో పాటు తెలుగును కూడా ఇతర భాషలవాళ్ళు నేర్చుకోవాల్సి వస్తుంది.పార్లమెంటులో హిందీ వాళ్ళలాగా మనం కూడా తెలుగులో మాట్లాడవచ్చు. కేంద్ర ప్రభుత్వం జారీచేసే ఉత్తర్వులన్నీ తెలుగులో పొందవచ్చు. కేంద్రంతో ఉత్తర ప్రత్యుత్తరా లన్నీ తెలుగులో నడుపవచ్చు. చట్టాలన్నీ తెలుగులోకి మార్చబడతాయి. తెలుగులో తీర్పులొస్తాయి. తెలుగులో ఇచ్చే అర్జీలు ఢిల్లీలో కూడా చెల్లుతాయి. ఇతర రాష్ల్రాల్లో ఉన్న తెలుగువారికి కొండంత అండ, గౌరవం హిందీ వాళ్ళతో పాటు సమానంగా లభిస్తాయి. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, రైల్వేస్టేషన్లలో బోర్డుల విూద తెలుగులో కూడా పేర్లు రాస్తారు. ఈ రోజున హిందీ భాష వల్ల హిందీ వాళ్ళకు ఏయే ప్రయోజనాలు ఒనగూడాయో అవన్నీ తెలుగు వాళ్ళు పొందవచ్చు.
----- నూర్ బాషా రహంతుల్లా
స్పెషల్ గ్రేడ్ డిప్యూటీకలక్టర్
రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ
తుళ్ళూరు 9948878833

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి