20, జనవరి 2018, శనివారం

తెలుగు లిపి సంస్కరణ,తెలుగు లిపిని సంస్కరిస్తేనే మంచిరోజులు




తెలుగు లిపి సంస్కరణ 

తెలుగు లిపిని సంస్కరిస్తేనే మంచిరోజులు
ఆంగ్ల భాష ప్రపంచంలో అతిపెద్దభాషగా ఎదిగి ఏలటానికి దాని అక్షరాలు  నాలుగు బడుల్లో ఉండటం ఒక కారణమని ఆచార్య ప్రబోధానంద యోగి గారు అంటుంటే నిజమేనా అని ఆగి ఆలోచించవలసి వచ్చింది.ప్రపంచం లో ఎన్నో భాషలు ఉంటే లిపి నాలుగు రకాలుగా ఏ భాషకన్నా ఉందా అని ఆయన ప్రశ్నించాడు.నిజమే కదా ? నాలుగు రకాల లిపులు ఇంకే భాషకన్నా ఉన్నాయో లేదో తెలిసినవాళ్ళు చెప్పాలి.చాతుర్వర్ణం మయా సృష్ట్యామ్ అనే శ్లోకం ఆధారం చేసుకొని అదే మాదిరిలో నాలుగు బడుల అక్షరాలు చేసుకున్నారేమోనని ఆయన సందేహమూ వ్యక్తం చేశారు.భాష ఎదగాలంటే లిపి కూడా ముద్రణకు,రాయటానికి అనుకూలంగా బాగుండాలన్నమాట.56 అక్షరాలున్న మన అతిపెద్ద తెలుగు లిపికి కూడా నాలుగు బడుల అక్షరాలు సమకూర్చలేము కానీ  ఉన్న ఒకే ఒక్క లిపిని ముద్రణకు రాతకూ ఎలా అనుకూలంగా చెయ్యాలో  ఆలోచిద్దాం.

ఇణి ,,న్య

ఇది ఇటీవలే ఎదురైన సమస్య. జ్ఞానము అని రాయకుండా జ్నానము అని రాస్తే ఫేస్ బుక్ అంగీకరిస్తోంది. జ్ఞా అనే తెలుగు అక్షరం ఎక్కడ కనబడ్డా మొత్తం పోస్టునే తొలగిస్తోంది. జ్ఞా లోని ఇణి గుర్తు సురక్షితమైనదే కాబట్టి అనుమతించాలని అభ్యర్ధన పంపాను.ఇణి గుర్తు తెలుగు అక్షరమాల లో ఒక అక్షరం.దాని ప్రత్యేకత దానిది.ఈ అక్షరాన్ని వదిలేద్దామా కాపాడుకుందామా?అని మిత్రులను అడిగితే అక్షరాన్ని వదులుకోకూడదు అని కొందరు ,ఇది తాత్కాలిక సమస్యే త్వరలో తొలగిపోతుంది అని కొందరు అన్నారు. యూనీకోడ్ లో ఉన్న అక్షరమే అయినప్పటికీ ఈ అక్షరం ఉన్న వ్యాసాలను అది ఎందుకో తిరస్కరించి ఫేస్ బుక్ మిత్రులను ఇబ్బంది పెట్టింది.  
 
ప్రపంచ తెలుగు మహాసభలు ఇన్ని సార్లు జరిగినా ఎవరూ సరిగా పట్టించుకోని సమస్య లిపి సమస్య. మన జాతి వెనుకబడి పోవటానికి ,తెలుగులో చదువులు బండబారిపోవటానికి,ఇంగ్లీషుతో సమానమైన వేగం అందుకోలేకపోవటానికి మన లిపే ప్రధాన కారణమని పండితులు,మేధావులు ఎప్పటినుండో చెబుతూనే ఉన్నారు. అయినా లిపి సంస్కరణ జోలికి వెళ్ళకుండానే మహాసభల్ని ముగించేస్తున్నారు.భాషను బాగుచేసే లిపి సంస్కరణ కార్యక్రమాన్ని ఇప్పటికైనా చేపట్టడం మంచిది.
బ్రహ్మ ఏర్పరచిన లిపి 'బ్రహ్మలిపి' అనుకుంటున్నారేమోగాని మనవాళ్ళు లిపి సంస్కరణకు భయపడుతున్నారనిపిస్తోంది. సవర భాషకు గిడుగు కొత్త లిపిని తయారు చేశాడు అంటారు. కానీ కొత్త లిపి ఎందుకు?తెలుగు లిపినే వాడుకోవచ్చుకదా?కొత్త లిపి జనామోదం పొందటం కష్టమే.భాష వాక్కు రూపంలో ధ్వనిస్తే, ఆ ధ్వనికి సంకేతమే లిపి, ఈ లిపి మనిషి తన సౌలభ్యంకోసం తయారు చేసుకున్నాడు. మోషేకు పది ఆజ్ఞలు దేవుడు రాతి పలకల విూద హెబ్రూ లిపిలో చెక్కి ఇచ్చాడట. ఎందుకంటే మోషే భాష హెబ్రూగనుక. మనమంతా కలిసి ఈ శబ్దాన్ని ఈ అక్షరంతో రాయాలి. ఇలా రాయాలి అని నిర్ధారించుకుంటే అదే మన లిపిగా నిలబడుతుంది. ప్రపంచంలో వేలాది బాషలకు లిపి లేదు. ఆ భాషలు రానురాను నాశనమై పోతున్నాయి. కేవలం 26 అక్షరాలతో వత్తులు, గుణింతాలను కూడా కల్పించుకొని సాఫీగా యంత్రాల విూద సాగిపోతున్న ఇంగ్లీష్‌ తరహలో తెలుగు లిపిని కూడా సంస్కరించుకోవాలి.
భూపతి నారాయణమూర్తి 'భోధన, పాలన జనజీవన రంగాలలో తెలుగు' (1998) అనే పుస్తకంలో ఇలా అంటారు: మన లిపిలో ఉపయోగం లేని అక్షరాలు మూడోవంతు వరకు ఉన్నాయి. వాటిని రద్దుచెయ్యాలి. ఉ,ఖ,ఘ,ఞ,ఝ,థ,ణ వగైరా అక్షరాలను తీసి వేయాల్సి ఉంది. చైనా 3 సార్లు తన లిపిని సంస్కరించింది. శాస్త్ర సాంకేతిక పరికరాలకు అనుకూలంగా లిపిని తయారు చేసుకున్నారు. అలాగే తెలుగు లిపిని కూడా సంస్కరించాలి. అప్పుడే అధికార భాషగా తెలుగు రాణించగలదు. లిపిని సంస్కరించటం వల్ల అత్యధిక సంఖ్యలో ఉన్న నిరక్షరాస్యుల్ని కూడా అక్షరాస్యులుగా చేయటం తేలిక అవుతుంది.'' ఇప్పటికే మనం ఋ,బుూ,ఌ ,ఁ,ఱ,చ,జ,లాంటి అక్షరాలను వదిలించుకున్నాము. ''అక్షర దీక్ష'' వాచకాల్లో కేవలం 30 అక్షరాలే ఉపయోగించారు.
బూదరాజు రాధాకృష్ణ ''భాషాశాస్త్ర వ్యాసాలు'' (1990) అనే పుస్తకంలో ఇలా అన్నారు. ''నిజానికి పారిశ్రామిక విప్లవం, సాంస్కృతిక పునరుజ్జీవనం మొదలైన రోజుల్లో యూరప్‌లోని దేశాలు లాటిన్‌, గ్రీకు భాషల ప్రభావం నుంచి వేర్పడి దేశభాషల్లో సమస్త వ్యవహారాలు జరుపుకోవటం మొదలుపెట్టినప్పుడు ఇప్పుడు మనం పడుతున్న కష్టాలన్నీ తామూ అనుభవించాయి. అన్ని సమస్యలూ మనకే రాలేదు. ప్రయత్నలోపం వల్ల, భాషాస్వభావ పరిజ్ఞాన లోపం వల్ల, మాతృభాషాభిమాన లోపంవల్ల, తెచ్చిపెట్టుకున్న చిక్కులే మనకెక్కువ. ఉపయోగం వల్ల భాష పెరుగుతుంది. తెలుగును అధికార భాషగా వినియోగించినప్పుడు అదే సహజంగా అభివృద్ధవుతుంది.''
''...56 అక్షరాలున్న తెలుగు భాషకంటే 26 అక్షరాలే ఉన్న ఇంగ్లీషు ఎక్కువ వాడుకలోకి వచ్చింది, ప్రపంచ భాష అయ్యింది. కాబట్టి తెలుగు భాషకు 16 అక్షరాలే పెట్టి నంబర్‌ వన్‌ పొజిషన్‌ తెస్తాను చూడండి..'' అంటాడొక నాయకుడు సినిమాలో. అది అతను భావావేశంలో సాధ్యసాధ్యాలను గమనించకుండా అన్నమాట అయినప్పటికీ భాషా సంస్కర్తలు ఈ పనికి పూనుకోవచ్చు. తెలుగులో ఎదురయ్యే మొదటి సమస్య గుణింతాలు, వత్తులు. వీటివలన అక్షరానికి క్రిందా పైనా మరో రెండు లైన్లు స్థలం అవసరమవుతుంది. టైపుమిషను, కంప్యూటర్‌లలో అక్షరాలు ముద్రించేటప్పుడు ఈ విషయం తెలుస్తుంది. ఇంగ్లీషులో కేవలం AEIOU అనే అచ్చులతో మిగతా 21 హల్లులు కలిసి భాష ఒకే లైనులో సాఫీగాసాగి పోతుంది. ''తెలుగు లిపి పరిణామం'' అనే వ్యాసంలో డాక్టర్‌ తిరుమల రామచంద్ర వెలిబుచ్చిన కొన్ని అభిప్రాయాలివి. ''..తెలుగు లిపి గుండ్రంగా అవటానికి 2500 ఏళ్ళు పట్టింది. అంతకు ముందు ఇవి అడ్డపు, నిలువు గీతలే. భాష ధ్వనిరూపం. ఈధ్వనికి సంకేతాలే లిపులు. అచ్చు వచ్చిన తరువాత లిపి స్వరూపం మరింత సుందరమయి స్థిరపడింది. ఇక్ష్వాకుల కాలంలో శిల్పులు అక్షరాలకు ఒంపులు వయ్యారాలు చేకూర్చారు. అక్షరాల నిలువు గీతలు అడుగున పొడవై కుడి వైపునకు వంపు తిరిగాయి. శాలంకాయనుల కాలంలో కొన్ని అక్షరాల తలపై అడ్డగీత ఏర్పడింది. కొన్ని అక్షరాలు గుండ్రతనం వదిలి కోణాకారం దాల్చాయి. విష్ణుకుండినుల కాలంలో తలపై అడ్డుగీత అన్ని అక్షరాలపై కనిపించింది. వీరి కాలంలో 'ళ్జ' ఆనే వింత అక్షరం ఉండేది. తరువాత అంతరించింది. చాళుక్య లిపి చక్కగా నిలువుగా ఉంటుంది. నన్నయ కాలం నుంచి వేంగీ చాళుక్య లిపిలో మార్పులు ప్రారంభమై 200 ఏళ్ళకు కన్నడ, తెలుగు లిపులు విడిపోయాయి. తెలుగు మరీ గుండ్రమై పోయింది, కన్నడ లిపి కోణాకార మయ్యింది. నన్నయ్య కాలపు అక్షరాలకు మధ్యన అడ్డంగా గీత గీస్తే తలకట్టు దగ్గర తెగుతుంది. అంటే తలకట్టు సగమూ, తక్కిన అక్షరం సగమూను. కాకతీయుల అక్షరాలలో తలకట్టు చిన్నదై తక్కిన భాగం పెద్దది కావటంతో అక్షరాలు పొంకంగా , దీర్ఘవర్తులంగా అయి అందం వచ్చింది. ప, హలు తలకట్టు విదిల్చుకున్నాయి. చాప, జల్లెడ వంటి వాటిలో 'త ఒత్తు' వంటి గుర్తు 19వ శతాబ్దంలో సి.పి. బ్రౌన్‌ పెట్టించాడు. మరో వింత అక్షరం అరసున్న. 16వ శతాబ్దానికి ముందు కనిపించదు.
ముఖ్యాక్షరాలు ఎంతగా మారాయో గుణింతాల గుర్తులు అంతకు రెండింతలుగా మారాయి. క్రావడి మరొక్క రూపం వలపల గిలక 'కర్మ' అని వ్రాయడానికి కమ్‌ అని వ్రాసేవారు. ఈ విధంగా తెలుగు లిపి 23 వందల సంవత్సరాలలో ఎన్నో మార్పులు పొంది నేటికీ రూపానికి వచ్చింది. ప్రస్తుత యంత్రయుగంలో ఎన్నో మార్పులు పొందవచ్చు. లోహాక్షరాలు చేతితో పేర్చుకొనే అవసరం పోయి, ఆంగ్లంలో లాగా మోనోటైప్‌ యంత్రాలలోను, లైనోటైప్‌ యంత్రాలలోను టైప్‌లాగా కొట్టే వరకు అభివృద్ధి చెందింది. అక్షరాలను విడగొట్టి కలిపే పద్ధతిలో స్వరూపాలు గూడా ముందుకన్నా మారాయి. కంప్యూటర్‌ ద్వారా కంపోజ్‌ చేసే పద్ధతి ప్రస్తుతం గొప్ప విప్లవం. ఒకచోట వాడిన మాట పలుచోట్ల అక్షరరూపం దాల్చే పద్ధతి కూడా వచ్చింది. శ్రమ తగ్గించుకొని లాఘవం కోరే మానవుని బుద్ధి ఈ వర్ణమాలలోనూ ఎన్నోమార్పులు తలపెట్టవచ్చు.
విజయ లిపి –భారతి లిపి
భారతదేశం లోని అనేక భాషల లిపులను కలపటానికి ఉమ్మడి లిపులను తయారు చేయటానికి కొన్ని ప్రయత్నాలు జరిగాయి : సత్య సాయిబాబా కోరికమేరకు కన్నడ –తెలుగు లిపులను కలిపి విజయ లిపి రూపొందించే ప్రయత్నం జరిగింది. శ్రీకృష్ణదేవరాయల స్మృతి చిహ్నంగా.. విజయనగర సామ్రాజ్యాన్ని జ్ఞప్తికి తెచ్చేలా ‘విజయ లిపి’ అని పేరు పెట్టారు. బాబా చేతుల మీదుగా ఆవిష్కరణ చేశారు. మద్రాసు ఐ.ఐ.టి. ప్రొఫెసర్ వడ్డాది శ్రీనివాస చక్రవర్తి భారతి లిపి రూపొందించారు. పెరియార్ రామస్వామి కూడా తమిళ అక్షరమాల ను ఆధునీకరించారట.ఇవన్నీ ప్రజలకు లిపి బాధలు తొలగించటానికే.

 ''కొన్ని తెలుగు ముద్రాక్షరాలు అచ్చు కూర్పరులకు విసుగు పుట్టించేవి. తెలుగు లిపిలో ఉన్న క్లిష్టత వల్ల తెలుగులో అచ్చు కూర్చటానికి (కంపోజింగ్‌కు) చాలా ప్రయాస పడేవారు. ఉదాహరణకు ఆనాడు అచ్చులో ఉపయోగిస్తున్న అర్ధచంద్రాకారంలో వేరొక వర్ణానికి కిందరాస్తూ ఉండిన రావడి కూర్పు చాలా శ్రమ కలిగించేది. దీన్ని సి.పి. బ్రౌన్‌ తెలుగు శాసనాలలో ఉన్న గుర్తును నమూనాగా గ్రహించి లాంటి రెండు రూపాలు కల్పించారు. ఈ సంస్కరణల వల్ల కూర్పరులకు కొంత శ్రమ తగ్గింది. అచ్చు కూర్పు కొంత మేరకు వేగవంతమయ్యింది. ఈ కొత్త రూపాలకు 'బ్రౌన్‌ రావళ్ళు' అనే పేర్లు కలిగాయి. ఇలాగే ప,వ,న, స, ల విషయంలో లిపిలో ఉన్న సామ్యాన్ని బట్టి పొరబాటు పడటానికి అవకాశం ఉన్న దాన్ని గ్రహించి కన్నడంలో ఉన్నట్లు ఈ అక్షరాలలో స్పష్టంగా మార్పు కనబడే విధంగా టైపులు పోత పోయించి సి.పి.బ్రౌన్‌ వాటిని వాడుకలోకి తెచ్చారు. కాని ఇవి తెలుగులో నిలిచినట్లు కనబడదు. బ్రౌన్‌ కొన్ని సంస్కరణలు ప్రవేశ పెట్టినా, తెలుగు, ముద్రణ పెక్కు లోపాలతో సాగుతూ వచ్చింది. ముద్రాక్షరాల సంఖ్యను 405 కన్నా తగ్గించటం ఎవ్వరికీ సాధ్యం కాలేదు. బందరులోని కళ్యాణీ టైపు ఫౌండ్రీ అధిపతి కె.వి. కొండయ్యగారు అక్షరాల సొంపు చెడకుండా ముద్రణా యంత్రానికి ఒదిగే విధంగా టైపు తయారీలో సాంకేతిక మార్పులు చేసి, 350కి తెలుగు లిపి రూపాలను కుదించారు. దీన్ని '' కళ్యాణీ టైపు '' అన్నారు. తక్కువ వ్యవధిలో అచ్చుకూర్చి తక్కువ వ్యయంతో తెలుగు పుస్తకాలు ముద్రించవలసిన అవసరం ఏర్పడింది. దీనికి తెలుగు లిపి ప్రతిబంధక మైంది. అది ముద్రణకు అనుకూలంగా లేదు. గుణింతపు గుర్తులు (తలకట్టులు, గుడులు, సుడులు) మొదలైనవి అక్షరానికి పైనా కిందా ఉండటం, సంయుక్తాక్షరాలు, ద్విత్వాక్షరాలూ, వీటి గుర్తులు కొన్ని సూటిగా అక్షరం కింద ఉండటం, అక్షరాలు అధికంగా ఉండటం అనే అంశాలు తెలుగు లిపిలోని క్లిష్టతకు ముఖ్యమైన కారణాలు. ఇలాంటి క్లిష్టత వల్లే తెలుగులో పుస్తక ముద్రణ వేగంగా జరగటం లేదు. లోపాలను తొలగించి తెలుగు లిపి సంస్కరణ తప్పనిసరిగా జరపవలసి ఉంది.
మన మీనాడు కంప్యూటర్‌ యుగంలో పురోగమిస్తున్నాం. పరిణామాలను ఆహ్వానిస్తున్నాం. వేగం నేటి యుగధర్మం. ఈ వేగానికి తట్టు కోలేనిదేదీ నిలవదు. మందకొడిగా అక్షరాలు కూడా నడక సాగించలేవు. తెలుగు భాషకు. ఇదొక సంధియుగం. మద్రాసులో మురళీకృష్ణ అనే ఇంజనీరు బాపు అక్షరాలతో సహా అందంగా అక్షర స్వరూపాలకు కంప్యూటర్‌ ప్రింటింగ్‌కి అనువుగా కీ బోర్డులు రూపొందించాడు. లిపిని ఇంకా సంస్కరించి తెలుగు భాషా స్వరూపాన్ని ఆధునీకరించటానికి ప్రయత్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.'' . ప్రభుత్వం, అధికార భాషా సంఘం ,తెలుగు విశ్వవిద్యాలయం ''లిపి సంస్కరణ'' కొరకై నడుము బిగించాలి.

 ఒకసారి నేనే న్యాయమూర్తినయ్యాను. రంపచోడవరం మొబైల్‌ సబ్‌ డివిజనల్‌ మేజిస్ట్రేట్‌ . అంతా గిరిజనులు, మన అచ్చ తెలుగువాళ్ళు, ఆహా, ఇంకేం తెలుగులో తీర్పులివ్వొచ్చు అని ఆనందపడుతూ వెళ్ళాను. అక్కడా పదిమంది లాయర్లు ' యువరానర్‌' అంటూ ప్రత్యక్షమయ్యారు. ఆంగ్ల భాషాకోవిదులైన అడ్వకేట్లు నల్లకోట్లు వేసి నాముందుకొచ్చి, నేను తెలుగు న్యాయం మాత్రమే చెప్పబూనటం అపూర్వం, సాహసం, ప్రమాదభరితం అని ఆంగ్లంలో ఉపదేశించారు. అడివిలో కూడా ఆంగ్లమేనా ఇక నా తెలుగెక్కడ తల్లీ? అని తడుముకున్నాను, మదనపడ్డాను. వాది, ప్రతివాది, సాక్షులు అంతా తెలుగులో చెబుతున్నారు. వాళ్ళు చెప్పింది చెప్పినట్లు వాంగ్మూలం టైపు చేయమంటే ''తెలుగు టైపు మిషన్‌ లేదు, అయినా అది కష్టం, విూరు ఇంగ్లీషులోకి మార్చి చెప్పండి కొడతాం'' అని సిబ్బంది ఇబ్బంది పడ్డారు. శక్తిచాలనివాడు సాధుత్వం వహించినట్లుగా బహుశా తెలుగును అభిమానించే న్యాయమూర్తులంతా ఇటువంటి ఇబ్బందుల్ని నెగ్గుకు రాలేక మౌనం దాల్చారని స్వానుభవం మీద అర్థం అయ్యింది.
కంప్యూటర్లొచ్చాయి, కోర్టులో తెలుగు సాఫ్ట్‌వేర్‌ వాడుకోవచ్చుగదా అని కొందరు ఉచిత సలహాపడేశారు. నిజమే గదా అని కంప్యూటర్‌ అడిగాం. ఇస్తామన్నారు అయితే దానికి ఇంగ్లీష్‌ కీబోర్డే ఉంటుంది. ఇంగ్లీష్‌లో కొడితే తెలుగు అక్షరాలు ప్రత్యక్షమవుతా యన్నారు. మాడుమీద కొడితే మోకాలు పగిలినట్లు ఈ బాధ మనకెందుకు తెలుగు మాటల్నే ఇంగ్లీషులో కొడదాం తేలికగా పనైపోతుంది annaru kondaru అసలు విషయం అర్థంకాకుండా పోతుంది annaru inkondaru ఇలాంటి తీర్పులు ఎవరు ఒప్పుకొంటారండీ అని ఇంకొంత మంది ఆక్రోశించారు. వత్తులు గుణింతాలతో పడిలేచి చచ్చేకంటే, యంత్రానికి అనువైన ఆంగ్లాక్షరాలతో పనిచేసుకోవచ్చు గదా అప్పుడు మన తెలుగును ఇంగ్లీషొచ్చినోళ్ళంతా చదువుతారు, తద్వారా అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ఇంగ్లీష్‌ సౌలభ్యాలన్నీ మనం కొట్టేయవచ్చు అన్నారింకొందరు . అయ్యవారిని చెయ్యబోతే కోతి అయినట్టవు తుందేమోనని అన్నారు మరికొందరు. ఆచర్చ అంతటితో ఆపాము.
ఇంతకీ తెలుగుకు వైభవం తేవటానికి ప్రభుత్వం నడుం బిగించిదనే వార్తలు, ప్రజల భాషకు పట్టం కట్టడానికి పలుచర్యలు తీసుకుంటామని అధినేతలు ప్రకటించటం సంతోషాన్ని కలిగిస్తున్నాయి. ఎన్టీరామారావుగారు న్యాయ పంచాయితీలు ఏర్పాటు చేయాలని ప్రయత్నించారు. అవి వస్తే ప్రజల భాషలో తీర్పులొస్తాయి. పరాయి ప్లీడర్లు, పరాయిభాష, పరాయి ప్రాంతం లాంటి సమస్యలు ఉండవు. ఏ భాషలో న్యాయస్థానం తీర్పులిస్తుందో అదే నిజమైన అధికార భాష. తెలుగుకు ఆ స్థాయి రావాలి అని నాఆకాంక్ష! ఇంగ్లీషు ప్రభావంతో తెలుగు తెల్లబోతోంది. ఆధునికులు మాట్లాడే నాలుగు ముక్కల తెలుగులో మూడుమాటలు ఇంగ్లీషువే ఉంటున్నాయి. ఇంగ్లీషు మాటలతో చక్కగా కలిసి పోయి కొత్తరకం ''తెల్గిష్‌'' భాష తయారయింది. ప్రస్తుతం ''తెల్గిష్‌'' వీరవిహారం చేస్తోంది.                                                                 సంస్కృతం, తమిళంతోపాటు తెలుగు కన్నడ భాషలను కూడా ప్రాచీన భాషలుగా కేంద్రం ప్రకటించింది. ప్రాచీన హోదాతో వచ్చే నిధుల్ని ఆధునిక అవసరాలకు వినియోగించాలనే వాదనలు అప్పుడే మొదలయ్యాయి. చైనా భాష తమిళంకంటే ప్రాచీనం. వారు లిపి ఆధునిక అవసరాలకు అనువుగాలేదని చాలాసార్లు సంస్కరించుకున్నారు. మనం కుండపెంకుల మీద, బండరాళ్ళమీద రాసుకుంటున్న రోజులలో ఒక లిపి సహితం లేని రష్యావాళ్ళు, జపాన్‌వాళ్ళు వారి భాషలను ఆధునిక అవసరాలకు అనువుగా మార్చారు.మన లిపిని మనం ఎందుకు మార్చుకోలేము? జాతి ఎదుగుదలకు కావలసింది వారి భాషను ప్రాచీనహోదాతోపాటు ఆ భాషను ఆదునిక అవసరాలకు కూడా సరిపడేలా తీర్చిదిద్దుకోవడం. భాషాభిమానంతో పాటు ప్రజల నిత్య జీవితానికి సంబంధించి పాలనా వ్యవహారాలలో స్వభాష పెత్తనం చేయాలి.                                                                                      తెలుగు లిపి ఎన్నోసార్లు మారింది

"ఇంపు చేయవచ్చు కంప్యూటరందుండు

అచ్చరాల బెడద ఖచ్చితముగా

అలవికానిదంటు అన్వేషణకు లేదు

తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ


ఉన్నలోపములను తిన్నగా సవరించి

తల్లిభాష నున్నతముగా తీర్చిదిద్ది

అప్పగింపవోయి అధికార పీఠాన్ని

తెలివి తెచ్చుకోని తెలుగు బిడ్డ


అరయ యూనికోడు కందరూ క్రమముగా

మారి మాతృభాష మనుగడకును

సహకరించినపుడె సంపూర్ణ సమృద్ధి

తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ


లోటు పాటులుంటె నీటుగా సవరించి

పాటు చేసి తెలుగు మీట నొక్కు

ఎలుకలున్న వంచు యిల్లు తగలేతుమా

తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ


లిపిని సంస్కరించి అపర వజ్రమ్ముగా

తీర్చి దిద్ది చూడు తెలుగు భాష

రాజ పీఠమునకె తేజస్సు నందించు

తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ "

--- ఆకురాతి గోపాలకృష్ణ


లిపిని మార్చుకోవడం ఎందుకు ?
ఇంగ్లీషు స్థాయిలో మన భాషకుకూడా అభివృద్ధి చేసిన యాంత్రిక సదుపాలు కల్పించడం కోసమే.వాస్తవానికి లిపి సంస్కరణ యంత్రాలకనుగుణంగా జరగాలి. కంప్యూటర్‌లలో వాడకానికి ప్రస్తుతం తెలుగు సాఫ్ట్‌వేర్‌లో ఏయే సమస్యలు తలెత్తుతున్నాయో వాటిని నిశితంగా, పరిశీలించి నిరంతరం వాటిని బాగుచేసే నిపుణుల్ని నియమించాలి. పరిశోధకుల్ని ప్రోత్సహించాలి.అలాంటి మంచి పనులు ఏవీ ఏళ్ళతరబడి తెలుగువాళ్ళు చేసి తెలుగు ప్రజలకు తెలుగు ద్వారా సౌకర్యం కల్పించలేదు.
భాషను పాడుచేసుకొవడం, మళ్ళీ బాగుచేసుకోవాలన్న అలోచనే లేకపోవటం, అరకొరగానైనా చేపట్టిన పనిని పూర్తి చేసుకోలేక చతికిల పడుతూ ఆంధ్రులు ఆరంభ శూరులు అన్న నానుడిని సార్థకం చేశారు.
పూర్వం మన భాష నశించిపోతుందే అని కొంత మంది నాయకులైనా బాధపడేవారు. కానీ ఇప్పుడు తెలుగు ఎందుకూ పనికిమాలిన భాషనీ, ఇంగ్లీషు, హిందీ వస్తే మనం ఎక్కడైనా చలామణీ కావొచ్చనీ, పదవులు దక్కాలన్నా, పరపతి పెరగాలన్నా కేవలం తెలుగు వస్తే చాలదనీ, హిందీ, ఇంగ్లీషు భాషలు తప్పనిసరిగా నేర్వాలనీ, చచ్చిపోయే ముసలి భాషను ఎవరూ బ్రతికించలేరనీ మన తెలుగు మేధావులే వాదిస్తున్నారు. మన నాయకులు అందుకు వంతపాడుతున్నారు. ఇక వీళ్ళు తెలుగుకు అధికార పీఠం దక్కనిస్తారా? తెలుగు జనం ఉద్యోగాల కోసం, విజ్ఞానం కోసం ఇంగ్లీషును ఆశ్రయించక తప్పదంటున్నారు మన మేధావులు.

తెలుగు అధికార భాష కావాలంటే ఇంగ్లీషు స్థాయికి దానిని అభివృద్ది చెయ్యాలి. తెలుగు నేర్చుకునే వాళ్ళ సంఖ్య పెరగాలి. ఎందుకు? ఎలా? అని మన పాలకులు, ప్రజలు ప్రశ్నించుకోవాలి. మన ప్రభుత్వం నడుపుతున్న తెలుగు మీడియం స్కూళ్ళన్నీ ఇంగ్లీషు లిపి లోకి మారిస్తే చాలు. ఒక్క చర్యతో అన్నిసమస్యలూ పరిష్కార మవుతాయి. కానీ, ఇప్పుడున్న ఇంగ్లీషు మీడియం స్కూళ్ళన్నింటినీ తెలుగు మీడియం లోకి మార్చాలంటే అడుగడుక్కీ అడ్డంకులొస్తాయి. ముందు ఇంగ్లీషులో తీర్పులిచ్చే కోర్టులే అడ్డుపడతాయి. కేంద్ర ప్రభుత్వం అడ్డుపడుతుంది. గవర్నర్లు, ఇతర భాషల ఐ.ఎ.యస్‌. ఆఫీసర్లు అడ్డుపడతారు.
ఈనాడు అమెరికాలో కంటే ఎక్కువగా ఇండియాలోనే ఇంగ్లీషు మాట్లాడే వాళ్ళున్నారు.ఆ మేరకు మన భాషలు నాశనం అయిపోయాయి. దీనికి ప్రధాన కారణం మన దేశానికి లింకు భాష కావాలి. జాతీయ, అంతర్జాతీయ భాషల్ని మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా దేశం కోసం మోస్తూ, మన భాషను గత్యంతరం లేక నిర్లక్ష్యం చేస్తూ పోవాలి.
ఒక్కో భాష మాట్లాడేవారు ఒక్కో జాతి. ఎవరి భాష వారికి గొప్ప. 'దేశ భాషలందు తెలుగు లెస్స' అని మనమంటే కాదు హిందీయే గొప్ప అంటారు ఉత్తరాది వాళ్ళు.అలాంటి పరిస్తితుల్లో ఇంగ్లీషే భారతీయులందరికీ అవసరమైన లింకు భాషగా తప్పనిసరి అయ్యింది. నిరాఘాటంగా ఇండియాను పాలిస్తోంది.
మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇంగ్లీషు భాషను పాశ్చాత్యులే కాకుండా భారతీయులు కూడా సాంకేతికంగా, శాస్త్రీయంగా ఎంతో అభివృద్ధి చేశారు. కోట్లాది మంది భారతీయులు ఇంగ్లీషు నేర్చారు. అఆలు రాకపోయినా ABCD లు వచ్చేస్తున్న రోజులివి. తప్పదు మరి. వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకుని భవిష్యత్తు ప్రణాళిక వేసుకోవాలి. ఇంగ్లీష్‌ వాళ్ళు I,II,III, IV లాంటి రోమన్‌ అంకెలు వాడేవారు. తరువాత 1,2,3,4,5,6,7,8,9 అనే అంకెల్ని అరబ్బుల నుండి, '0' ను ఇండియా నుండి తీసుకెళ్ళి తమవిగా చేసుకున్నారు. ఏమీ సిగ్గుపడలేదు. దొంగతనంగా,నామర్దాగా భావించలేదు. పరాయి భాషలకు చెందిన అంకెలని ద్వేషించలేదు. తమ అంకెలు నామ రూపాల్లేకుండా పోతున్నాయే అని బాధపడలేదు. కేవలం సౌకర్యం చూసుకున్నారు. తమ భాష చెలామణీ కావటం చూసుకున్నారు.
మరి మనవాళ్ళు లింకు భాషగా ఇంగ్లీషును ఎన్నుకున్న రోజున, ఇంగ్లీషు లిపిని కూడా లింకు లిపిగా జాతీయ లిపిగా నిర్ణయించినట్లయితే భారతీయ భాషల నడక వేగం పెరిగి ఉండేది. దేశ వ్యాప్తంగా అన్ని భాషల వాళ్ళకూ ఒకే లిపి నేర్పబడేది. భారతీయ భాషలు శబ్ద రూపంలో ఎన్ని విన్యాసాలు చేసినా, ఒకే లిపిలో ఉంటే కనీసం దేశస్తులంతా చదివే వాళ్ళు. ఒక లిపికి అలవాటైన మనిషి తన భాషను మరో లిపిలో రాయటానికి, తన భాషను మరో లిపిలో చదవటానికి అంత సుళువుగా ఇష్టపడడు. లిపి మారితే తన భాషే మారిపోయినట్లుగా ఫీలవుతాడు. కానీ ఈనాడు మనం మన పొరుగు భాషలను కూడా చదవలేకపోతున్నాం. దేశమంతటికీ ఒకే లిపి ఉన్నప్పుడు ఇరుగు పొరుగు భాషలు అర్థం కాకపోయినా, మాట్లాడలేకపోయినా కనీసం చదవటం వస్తుంది. ఏ భాష వాడికైనా చదివిపెట్టడం వస్తుంది. వంద రూపాయల నోటు మీద 18 లిపుల్లో ముద్రించనక్కరలేదు. ఆయా భాషల వాళ్ళు వందరూపాయల్ని ఏమని పలుకుతారో ఆ శబ్దాన్ని ఇంగ్లీషు లిపిలో ముద్రించవచ్చు. వందరూపాయల్ని ఏ భాష వాళ్ళు ఏమని పిలుస్తారో మిగతా అన్ని భాషల వాళ్ళూ చదివి తెలుసుకోవచ్చు. దీన్ని Transliteration అంటారు. సంస్కృత శ్లోకాల్ని,అరబీ సూరాలను మనం తెలుగు లిపిలో రాసుకుంటున్న మాదిరిగానన్న మాట.
మన ఆర్టీసీ బస్సుల మీద తెలుగు అంకెలు వేశారు కానీ అరబీ అంకెల్ని అంటే నేటి ఇంగ్లీషు అంకెల్నే జనం చదువుతున్నారు. కాలగమనంలో పారవేయబడిన వాటిని వెతికి తీసుకొచ్చి జనానికి అలవాటు చేస్తామంటున్న భాషాప్రియులు, అంతకంటే సుళువుగా జనమందరికీ అలవాటైన వాటితోనే భాషాభివృద్ధి చేయవచ్చు. వాక్కు రూపంలో ఉండే భాషకు మనిషి కల్పించిన రూపమే లిపి. లిపిరాని వాడికీ భాష ఉంటుంది. అసలు భాషే రాని వాడికి లిపి ఏముంటుంది? భాషను చదవటానికీ, రాయటానికీ పెట్టుకున్న గుర్తులే అక్షరాలు. అవి మన దేశంలో అందరికీ ABCD ల రూపంలో నేర్పబడ్డాయి. ''అఆ'' అనే అక్షరాలొచ్చిన పిల్లలు దేశమంతటా ఉండరు కానీ ABCD అనే అక్షరాలొచ్చిన పిల్లలు దేశమంతటా ఉన్నారు. వండి వడ్డించిన దాన్ని తినటానికి తిరస్కరించినందువల్ల మన జాతి శుష్కించిపోతున్నది. తెల్లవాడు అందరివీ దొంగలించి తిని బలిసిపోయాడు. నల్లవాడు అలిగి నలిగి నీలిగి నీరసించాడు.
సుప్రీం కోర్టు నుండి, ఈ దేశ సర్వోన్నత పాలక పీఠాల నుండీ ఇక ఇంగ్లీషును తొలగించటం సాధ్యం కాదు గనుక రకరకాల లిపుల్ని సంస్కరించి యావత్తు భారత జాతికీ అర్థం అయ్యేలా చేయటం అసాధ్యం గనుక, ఆంగ్ల లిపిని స్వంతం చేసుకుని, దేశంలోని అన్ని భాషలకూ దాన్నే జాతీయలిపిగా అమలు చేస్తే మనకు ఎన్నో కష్టాలు తగ్గుతాయి. అంతర్జాతీయంగా ఆంగ్లభాష లిపికి సమకూరిన యాంత్రిక ప్రయోజనాలన్నీ మన దేశీయ భాషలకూ సమకూరుతాయి. ఈ మార్పుకొక తరం పడుతుంది. వివిధ లిపులకు అలవాటు పడిన పెద్దలు తప్పనిసరిగా ఇబ్బంది పడతారు. కానీ కొత్తగా నేర్చుకునే పిల్లలు సునాయాసంగా ఇంగ్లీషుతోపాటే తమ మాతృభాషల్నీ ఒకే కీ బోర్డుతో సాధన చేస్తారు. ఇంగ్లీషు అక్షరమాలలో లేని కొన్ని శబ్దాలకు కొత్త అక్షరాలను జోడించుకోవటం కన్నా, ఉన్న అక్షరాలకే కొన్ని గుర్తులు జోడించటం ద్వారా ఈ శబ్దం వస్తుందని శాసనం చేయవచ్చు. దేశీయ భాషల మధ్య నిఘంటువుల తయారీ కూడా సుళువవుతుంది. భాషలు నేర్చుకోవటం కూడా తేలికవుతుంది.
మీసేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వ కార్యాలయాలకు ప్రజలు తెలుగు ఫిర్యాదులు రోమన్ లిపిలోనే పంపుతున్నారు. ఇంగ్లీషు రాని వాళ్ళు కూడా ఇంగ్లీషు లిపిలో తమ తెలుగు ఫిర్యాదుల్ని ఎంతో చక్కగా పంపించారు. ఒక ఫిర్యాదు ఇలా ఉంది:-
Ayyaa,
NAA BHARTHA CHANIPOYI NAALUGELLAYYINDI. KUTUMBHASANKSHEMA PADHAKAM KINDA NAAKU SAHAYAM INKAAANDALEDU. TAMARU DAYATO AA SAHAYAM IPPINCHAGALARU.
ఈ ఫిర్యాదు యధాతథంగా కలెక్టర్‌ నుండి MROకు వెళితే, MROకూడా Telugu లోనే చక్కగా జవాబిచ్చాడు. పనిలో వేగం పెరిగింది. ఆంగ్ల భాష రాకపోయినా, అనువదించి కూర్చుకునే నేర్పు లేకపోయినా భావం చక్కగా చేరాల్సిన చోటికి చేరింది. ఆంగ్ల లిపి ద్వారా ఒన గూడే ఈ సదుపాయాన్ని మనం ఎందుకు స్వంతం చేసుకోకూడదు? నేటి పెద్దలు ముందు చూపుతో చేసే త్యాగాలే రేపటి పౌరులకు సుఖమైన జీవితాన్నిస్తాయి.
గుండ్రని అందమైన నా లిపి అంతరిస్తోందనే బాధ నాకూ ఉంది. కానీ లిపిని అంకెల్ని యంత్రానికి తగ్గరీతిలో ఆంగ్లేయులు అభివృద్ధి పరిచారు. వాళ్ళ అంకెల్ని మనం ఎలాగూ వాడుతూనే ఉన్నాం. ఇక అక్షరాలను కూడా వాడుకుంటే అధికార భాషగా రోమన్‌ తెలుగును ఫైళ్ళలో కంప్యూటర్ల ద్వారా అమలు చేయటం ఎంతో సుళువవుతుంది. లిపిసమస్య సాకుతో అధికారభాష అమలును ప్రక్కన పెట్టటం కంటే అంతర్జాతీయంగా అమలవుతున్న లిపినే మన భాషకు వాడుకుంటే మేలు జరుగుతుందని ఆశ. రానున్న రోజుల్లో దేశమంతటికీ ఉమ్మడి లిపిగా ఆంగ్లాక్షరాలను ఉపయోగించుకునే విషయమై విస్తృతంగా చర్చలు జరగాలి. దేశ భాషలన్నింటికీ జవసత్వాలను సమకూర్చే నిర్ణయాలు జరగాలని ఆశిద్దాం.
లిపిని మార్చుకోవటం ఎలా?
‘‘ప్రపంచంలోని అన్ని భాషల ముద్రణ ఒక ఎత్తు. తెనుగు ముద్రణే ఒక ఎత్తు. ఇదొక గారడీ. తెనుగు అక్షరాలు కూర్చడానికి కంపోజిటరు 700 దిమ్మలు, గళ్ళు జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రతి కంపోజిటరు శతావధాని, సహస్రావధాని కావలసి ఉంటుంది. ఈ చిక్కును తొలగించుకోడానికి ఏ రోమన్‌లిపినో అనుసరిస్తే అచ్చు సౌకర్యం కలుగుతుందనుకుంటే అనూచానంగా వచ్చిన ఈ లిపిని వదులుకోడం ఎలా?’’
(తిరుమల రామచంద్ర, మన లిపి పుట్టు పూర్వోత్తరాలు 1957) “ముత్యాలలాంటి తెలుగక్షరాలంటూ లిపిమీద లేనిపోని సెంటిమెంట్లు పెట్టుకోవడం మాని రోమన్ లిపిలో(a,aa,i,ee ఈ విధంగా) తెలుగును నేర్పితే అప్పుడు మన దేశం ఆధునిక యుగం లోనికి ప్రవేశిస్తుందని నా నిశ్ఛితాభిప్రాయం. ప్రపంచ తెలుగుమహాసభ వారు ఈ విషయమై ఆలోచించడం మంచిదని నేననుకుంటున్నాను” అని అన్నారు మహాకవి శ్రీ శ్రీ , ---ప్రజాతంత్ర (18.4.1976) "అనంతం" పేజీ196
భారతీయ భాషలకు ఏకలిపి అవసరమే
అంతర్జాతీయ ధ్వని విధేయ లిపి కాకపోయినా, ఆ పద్ధతిలో సవరింపబడిన రోమను లిపి భవిష్యత్తులో ప్రపంచ భాషలన్నిటికి సర్వవిధాల తగినదై సర్వోత్తమమూ, అభ్యుదయకరమూ అయిన లిపి కాగలదు. టైపుమిషను, లైనోటైపు మొదలైన వాటికి ఒకే విధమైన ముద్రాఫలకాలు(Key boards) మనకు లభిస్తాయి. ప్రపంచ మంతటా ఒకే విధమైన ముద్రణ వ్యవస్థ ఏర్పడుతుంది. అంటే ఇప్పుడు ఆంగ్ల అక్షరాలు రాస్తున్న పద్ధతిలోరోమ న లిపిలో రాసే విధానం అన్నమాట ) - కస్తూరి విశ్వనాథం (1989 నవంబర్‌ తెలుగు వైజ్ఞానిక మాసపత్రిక)

ముస్తఫా కమాల్ ఆటా టర్క్ లిపి సంస్కరణ

టర్కీ జాతిపిత,టర్కీ మొదటి అధ్యక్షుడు.1928 నవంబర్ 1 నుండి టర్కీభాషకు కొత్త అక్షరమాల ప్రవేశపెట్టాడు.అప్పటివరకు ఉన్న పార్శీ -అరబిక్ లిపి స్థానంలోకి అప్పటికే పాలకభాషగా అభివృద్ధి చెంది,ప్రజాదరణ పొందిన లాటిన్ లిపిని రప్పించాడు.టర్కీ భాష ఉచ్చరణకు వీలుగా 23 ఆంగ్లాక్షరాలకు అదనంగా అవసరమైన [ Ç, Ğ, I, İ, Ö, Ş, Ü ] అనే 6 గుర్తులను కలిపి 8అచ్చులు,21హల్లులుతో 29 అక్షరాలను సమకూర్చారు.ఇందువలన భాష చదవటం రాయటం సులభమై అక్షరాస్యత పెరిగింది. మనం కూడా త,ద,ణ,ళ,శ,లాంటి కొన్ని అక్షరాలకు గుర్తులు కల్పించుకోవచ్చు. ప్రస్తుతం యూనికోడ్లో మన తెలుగు అక్షరాలు అన్నీ ఇంగ్లీషు కీబోర్డు ద్వారానే టైపు చేస్తున్నాము కదా?
ప్రపంచీకరణ వచ్చిన తరువాత భాషల మద్య పోటీ అనివార్యం అయ్యింది. ఏ భాష నేర్చుకుంటే ఉపాధి లబిస్తుందో, ఆ భాష వైపుకే మనిషి పరుగులు తీస్తున్నాడు. అది అతని అవసరం. తెలుగుభాష మాత్రమే వచ్చిన వాడికి కూడా శాస్త్ర విజ్ఞానం,వృత్తి, ఉపాధి లభిస్తుందనే హామీ దొరికిన నాడు తెలుగు తప్పని సరిగా బ్రతుకుతుంది. తెలుగు భాష ఇంకా పది కాలాలపాటు మనుగడ సాగించేందుకు ఉన్న అన్ని మార్గాలలో ప్రతి ఒక్కరం ప్రయత్నిద్దాం.

నూర్ బాషా రహంతుల్లా ,స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ ,అమరావతి 9948878833((గీటురాయి 19.1.2018 - 2.2.2018)

Nalini Mohan Kumar KalvaNalini Mohan Kumar Kalva బాగుంది " లిపి సంస్కరణ " లో భాగంగా ఇక్కడ నా స్వీయానుభవం చెప్పదలచేదేమంటే ,ఇప్పుడు నేను ఉపయోగించే పద్దతి "గూగుల్ ట్రాన్స్ లిట రేషన్ - తెలుగు " ను డౌన్ లోడ్ చేసుకోవడం ద్వారా ,నేను ఇంగ్లీష్ కీ బోర్డ్ ద్వారానే ఈ విధంగా ఇంగ్లీష్ అక్షరాలు ను ఉపయోగించే " తెలుగు లిపి " ఆటో మేటిక్ గా కనబడే సౌలభ్యం వచ్చింది . వాస్తవానికి నేను ఏ టైపు మిషన్ పైన టైపు చేయడం( ఇంగ్లీష్ ,గాని తెలుగు కానీ ) నేర్చుకోలేదు. కానీ నేను అలవాటు ద్వారా ఈ విధంగా తెలుగు లో వ్రాయడం ,(అదే టైపు చేయడం) అవలీలగా చేయగలుగుతున్నాను . కాబట్టి తెలుగు భాషాభిమానులు ప్రతి ఒక్కరు ఈ విధంగా కంప్యూటర్ లోనూ అదేవిధంగానే సెల్ ఫోన్లో గూడాను ఇదే విధంగా చేసుకోవచ్చు . ముఖ్యంగా ఈ విషయ ప్రక్రియను నాకు చెప్పి అలవాటు చేసిన వాడు మిత్రుడు రహంతుల్లా నే !. అందుకు నేను మిత్రుడికి ఋణ పడిఉంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాను .

6 కామెంట్‌లు:

  1. https://antharlochana.wordpress.com/2013/04/22/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81-%E0%B0%B2%E0%B0%BF%E0%B0%AA%E0%B0%BF-%E0%B0%B8%E0%B0%82%E0%B0%B8%E0%B1%8D%E0%B0%95%E0%B0%B0%E0%B0%A3/

    రిప్లయితొలగించండి
  2. https://www.muchata.com/off-beat/time-to-delete-few-more-alphabets-in-telugu/

    రిప్లయితొలగించండి
  3. https://te.wikipedia.org/wiki/%E0%B0%B2%E0%B0%BF%E0%B0%AA%E0%B0%BF_%E0%B0%B8%E0%B0%82%E0%B0%B8%E0%B1%8D%E0%B0%95%E0%B0%B0%E0%B0%A3

    రిప్లయితొలగించండి