14, నవంబర్ 2019, గురువారం

భాషా రాజకీయం - తెలుగు చదివితే ఉద్యోగమేది ?

భాషా రాజకీయం - తెలుగు చదివితే ఉద్యోగమేది ? (సూర్య 17.11.2019)


తెలుగు ద్వారా ఉద్యోగమివ్వటం తెలుగు ప్రభుత్వాల వల్లకాదు.ఉద్యోగం కావాలంటే ఇంగ్లీషు అవసరమే అనుకోని ఇన్నాళ్లూ ధనవంతులు తమ పిల్లల్ని కాన్వెంట్లలో చదివించారు.ఇంగ్లీషు కాన్వెంట్లకు ట్యుటోరియల్ కాలేజీలకు వ్యతిరేకంగా పోరాటాలెమీ తెలుగునాట జరుగలేదు.ఉద్యోగము ఇవ్వలేని చదువు వ్యర్ధమే.ఇంగ్లీషు మాధ్యమం కోరుతున్నవారి వాదన అదే.ఇన్నేళ్ల పాలనలో తెలుగుకు ఉద్యోగాలు ఇచ్చే శక్తి స్థాయి ఏ ప్రభుత్వమూ తేలేకపోయింది. తెలుగు పద్యాలకు కవిత్వాలకు పరిమితమై పోయింది. బడిపిల్లలకు తెలుగు వ్రాయడం, చదవడం వీలుకాని పరిస్థితి.తెలుగులో పాలన అంటే ఒక కోరరాని కోరిక,అత్యాశలాగా మాట్లాడుతున్నారు.
‘నేను తెలుగు మాట్లాడను’ అని వందసార్లు పిల్లల చేత వ్రాయించిన వాళ్ళను దేశభక్తులుగా పొగుడుతున్నారు.మేము ఆంగ్ల మాధ్యమానికి వ్యతిరేకంకాదు,తెలుగుమాధ్యమంపై నిషేధం తప్పంటున్నాం.కావాలంటే హిందీని,సంస్కృతాన్ని తీసెయ్యండి.తెలుగులో ఒత్తులు,గుణింతాలు తీసేసి తమిళంలాగా బాగుచెయ్యండి.పనికిమాలిన ఛందస్సును వ్యాకరణాన్నీ ఎత్తేసి ప్రజలలో పాలనలో వాడుకభాషను అమలుచెయ్యండి అని ఇన్నాళ్లూ అడిగారు కానీ ఎవరూ మనసు పెట్టలేదు.మీ పుత్రులను మనమళ్లను ఇంగ్లీషు మీడియంలో ఎందుకు చేర్చారని వెంకయ్యానాయుడును,చంద్రబాబును, పవన్ కల్యాణ్ , రామోజీరావును జగన్ విమర్శించారు.తెలుగులో చదివితే ప్రపంచ స్థాయిఉద్యోగాలు రావని అందరికీ తెలుసు. ఆస్థాయికి తెలుగును తీసికెళ్లటం ఏ పాలకునివల్లా కాలేదు.ఇకమీదట అవ్వదు కూడా.కష్టపడి తయారు చేసుకోవటం కంటే అప్పటికే అమర్చిపెట్టినదాన్ని మేయటం సులభంకదా?

చావు,పెండ్లి మంత్రాలు తెలుగులో యెందుకు చదువరు అని కొందరు అడిగారు. ఏ మాతృభాషైనా సరే దాన్ని మాట్లాడేవాళ్ళ మారే అవసరాలకి ఆదుకోకపోతే మృతమవుతుంది.తెలుగు వ్యాకరణం పనికిరాని సంధులు, సమాసాలతో పాటు ఉంటుంది.ఉద్యోగాలకు పనికిరాని తెలుగు నేర్చుకుంటే ఉపయోగం ఏమిటి ?ఇప్పటికే 50% ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ఉన్నది.దాన్ని 100% చేస్తే తప్పేమీ కాదు.కాని తెలుగు మీడియం పూర్తిగా తీసివేయడం న్యాయమా? విద్యార్ధులు తమ తల్లిదండ్రుల లేదా తమ కోరిక మేరకు నచ్చిన మీడియంలో చేరి చదువుకుంటున్నారు. ఇంగ్లీష్ ప్రపంచానికి ద్వారమే .ఎవరు కాదన్నారు?ప్రస్తుతం అందరూ ఆంగ్ల మాధ్యమం లోనే చదువుకోవాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. అయితే తెలుగు మీడియం కూడా ఉండాలన్నవారు అభివృద్ధి నిరోధకులా? పేదవారికి వ్యతిరేకమా?మాధ్యమాన్ని ఎంచుకొనే స్వేఛ్చ విద్యార్ధికి ఉండాలా వద్దా?ఇప్పటికే ఉన్న మాధ్యమాన్ని కొనసాగించవచ్చుకదా?

ఇంగ్లీష్ విద్య తోనే వుయ్యూరు అమ్మాయి యలమంచిలి అర్చనారావు న్యూయార్కు న్యాయమూర్తి పదవిని సాధించిందన్నారు. ప్రైవేటు స్కూళ్లల్లో చదివిన, చదువుతున్న పిల్లలున్న సంపన్నుల కాలనీల్లోని ఇళ్లలో తెలుగు ఎందుకు చనిపోలేదు? పేద పిల్లలు కూడా తమలాగే ఇంగ్లిష్‌ నేర్చుకోవాలని వైఎస్‌ జగన్‌ కోరుకుంటున్నారు. ఆయన విధానంలో తప్పేముంది? ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగిష్‌ను ప్రధాన బోధనా భాషగా చేస్తామని చెప్పినందునే ప్రజలు ఆయనకు ఓట్లువేసి గెలిపించారు.మన జాతి నిర్మాతలు ఆ ఇంగ్లీషుభాషను ఎందుకు కొనసాగించారు? పైగా దేశాన్ని, రాష్ట్రాలను పా లిస్తున్న కులీనవర్గాలలో ఇంగ్లిష్‌ ఎందుకు మనగలిగి ఉంటోంది? 1947లో ఇంగ్లిష్‌ను జాతీయ భాష గా గుర్తించాలని, ప్రభుత్వపాఠశాలల్లో ఇంగ్లిష్‌ను తప్పకుండా బోధించాలని అంబేడ్కర్‌ పట్టుపట్టారనీ , ప్రైవేట్‌ స్కూళ్ళు కాలేజీలు ఇంగ్లిష్‌ బోధన చేశాయనీ,ఆబోధతో పైకులాలవాళ్లు బాగుపడ్డారనీ,కింది కులాలకు ఆంగ్లం అలవడితే మంచిదనీ,దానికి అడ్డుపడకూడదని కంచ ఐలయ్య లాంటి వారు వాదిస్తున్నారు. అవన్నీ నిజమే.ఇంగ్లీషు మీడియం ను ఎవరూ వద్దనటంలేదు.అడ్డుపడటం లేదు. మన పాలకులు పాడుపడ్డ తెలుగును బాగుచేయ్యకుండా ముందుకు పోతున్నారు.తెలుగు అసలు అనవసరం వదిలేద్దాం అంటున్నారు. ఆంగ్లాన్ని కాపాడుకుంటూనే మరో ప్రక్క తమిళనాడు ప్రభుత్వం తమిళంలో ఉద్యోగాలు సృష్టించింది. పెరియార్ కాలంనుండి తమిళ లిపిని సామాన్యులకోసం అనేకసార్లు మార్చుకుంది.తమిళంలో చదివితే భవిష్యత్తు ఉంటుందన్న నమ్మకాన్ని కలిగించింది.తమిళ మాధ్యమంలో చదివిన అభ్యర్డులకు ఉద్యోగాలలో 20 శాతం రిజర్వేషన్ ఇవ్వటం రాజ్యాంగబద్దమేనని ఏ రాష్ట్ర భాషను ఆ రాష్ట్రం కాపాడుకోవాలని మద్రాసు హైకోర్టు తీర్పు ఇచ్చింది.రాష్ట్రస్థాయిలో అత్యధిక మార్కులు సాధించినా తమిళం పాఠ్యాంశంగా ఉంటే మాత్రమే టాప్‌ ర్యాంకర్‌గా పరిగణిస్తారు.తమిళ భాషాభివృద్ధి కోసం ప్రత్యేక శాఖ ఉంది. తమిళమాధ్యమంలో పోటీ పరీక్షలు రాసిన న్యాయ,ఇంజినీరింగ్‌ విద్యార్థులను న్యాయమూర్తి పొగిడారు.వారూ తమిళం చదవాల్సిందే.కేంద్రమేమో హిందీ పక్షపాతి. తమిళనాడులో మాతృభాషకి ఇస్తున్న ప్రాముఖ్యం ఆంధ్రా,తెలంగాణాల్లో కూడా తెలుగుకు ఇ వ్వాలి.మాకు ఉపాధి దొరికే భాష కావాలని ప్రజలే ప్రభుత్వాలను అడుగుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో 10 శాతం మంది మాత్రమే ఇంగ్లీషు మీడియంలో బోధన చేయగలరు. మిగిలిన 90 శాతం మంది తెలుగు మీడియమే! ఆకస్మికంగా ఇంగ్లీషు మీడియం లోకి మారిన పిల్లల విద్యాప్రమాణాలు పడిపోయి,అర్ధంతరంగా చదువు మానేసి, న్యూనతకు గురైతే అందుకు బాధ్యత ఎవరిది? 5వ తరగతి వరకు ప్రతిఒక్కరూ మాతృభాషలోనే చదువుకోవటం వలన మాతృభాష రక్షించబడుతుంది.6 వ తరగతి నుంచి ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడితే మంచిది.మాతృభాషలో బోధనకు పూర్తిగా మంగళం పలకడం దేశంలో ప్రపంచంలో మరెక్కడా లేదు. ఫ్రాన్స్‌, చైనా, జర్మనీ, జపాన్‌ దేశాల్లో బోధన మాతృభాషలోనే జరుగుతుంది.అవన్నీ మనకంటే అభివృద్ధి చెందిన దేశాలే. తెలుగు అంకెలు ఇప్పుడు ఎవరూ వాడటం లేదు. ఇంగ్లీషు వాళ్ళు కూడా రోమన్ అంకెలు మానేసి అరబిక్ అంకెలు వాడుతున్నారు. శ్రీ శ్రీ గారు తెలుగు లిపి లో ఉన్న ఆటంకాలు గ్రహించి ఆంగ్ల లిపిలోకి మారటం మంచిది అన్నారు.తెలుగులో ఉన్న సవాలక్ష సమస్యలు సరిదిద్దుకోవాలి. అక్షరాలు మన పిల్లలకు ఎంతో సులువుగా ఉండాలని వాదిస్తూ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు చాలా కష్ట పడ్డారు. ప్రభుత్వ పాలకులు తెలుగు మహాసభలు జరిపారు కానీ లిపి సమస్యను పట్టించుకోలేదు.శ్రీ శ్రీ కూడా భవిష్యత్తు ఆలోచించి ఆంగ్ల లిపిని తెలుగుకు వాడుకొమ్మన్నారు.మన జనం కోసం మనం వారి బాట పట్టాలి.ఈ భాషను ఈస్థాయికి తెచ్చిన మన పితరులున్నారు.ఆ ప్రజల అందరి వాడకం వలన మనకు పదాలు స్ధిరపడతాయి.వాటిని అలా వాడితేనే మంచిది.తెలుగు నిఘంటువులోకి ప్రజల నోళ్ళలో నానుతున్న వేలాది ఇంగ్లీషు పదాలను తీసుకొని అనువాదాలలో వాడాలి. ఇప్పటి వరకు ప్లస్‌, ఈజీక్వల్టు, మైనస్‌, ఇంటు లాంటి ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధక పదాలను కల్పించి లెక్కలు చెప్పలేదు. తెలుగు విూడియం వాళ్ళు కూడా ప్లస్‌, మైనస్‌ అనే శబ్ధాల్నే వాడుతున్నారు. గత్యంతరం లేదు,అనుకున్న ఆంగ్లపదాలను మాత్రం తెలుగు నిఘంటువులో చేర్చటం అవశ్యం, అత్యవసరం. వాడుక పదాల సంపద భాషకు జీవమిస్తుంది. అవి పరభాషపదాలు కూడా కావచ్చు.తెలుగును వాడుక భాషలోకి ప్రజలకుపనికొచ్చేలా మార్చాలి.తెలుగు భాష రక్షణ,తెలుగులో పాలన కోసం తెలుగు మాధ్యమం లో చదివినవారికి ఉద్యోగాలు కల్పిస్తూ ప్రభుత్వం అండగా నిలవాలి.ప్రోత్సాహకాలు,రిజర్వేషన్లు ఇచ్చిమరీ తెలుగు భాషను రక్షించుకోవాలి. రాష్ట్రప్రభుత్వం ఉద్యోగాలకల్పన తెలుగు వారికోసం కూడా జరపా లి. తెలుగును కాపాడుకుంటూనే తమిళనాడు లాగా ఇంగ్లీషు మాధ్యమాన్నీ కొనసాగించవచ్చుకదా? తెలుగు పత్రికాధిపతులు,భాషాసంఘాలు తెలుగు మాధ్యమం కావాలంటూ హైకోర్టుకు వెళ్ళవచ్చుకదా?మాతృభాషలో ప్రాధమిక విద్య నేర్పటం కనీసధర్మం,రాజ్యాంగబద్దం.మన రాష్ట్రంలో కూడా తెలుగులో విద్యను కాపాడుకోటానికి తెలుగువిద్య ద్వారా ఉపాధి కల్పనకు హైకోర్టు మార్గదర్శకత్వాన్ని కోరటం మంచిది.
--నూర్ బాషా రహంతుల్లా ,విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్,6301493266

3 కామెంట్‌లు:

  1. Vivek Reddy బాగానే చెప్తున్నారు సార్...ఇంగ్లీష్ ఉంటేనే ఉద్యోగం అని మీరంటారు..మరి ఇంగ్లీష్ మీడియం లో స్కూల్ చెప్తే మీలాంటి పెద్దల బాధ ఎందుకో అర్థం కాలేదు... పోనీ తెలుగు మొత్తానికి మొత్తంగా తీసివేయ్యలేదు కదా.. సబ్జెక్ట్ చెప్తారు.. ఇంకో విషయం అందరూ విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం లో చదివినంత మాత్రాన తెలుగు రాయడం,చదవడం,మాట్లద్దాం మనేస్తారా సార్.మీరు అపోహలో పడి పది మందిని అపోహల్లోకి తోస్తున్నారు..
    Noorbasha Rahamthulla అసలు తెలుగు వ్యర్ధం అనే వాళ్ళకు తెలుగు సబ్జెక్టు మాత్రం ఎందుకు?తెలుగుకూడా కావాలి అనేవాళ్లది అపోహా ?
    Vivek Reddy సరే మీబోటోళ్లు అందరూ కలసి తెలుగు స్కూల్ పెట్టి మీ పిల్లల్ని అందులో చదివించడి సార్.. ఇప్పుడు పొరపాటున మీ పెద్దల పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదుతుంటే మొత్తానికి మొత్తంగా బడి మాన్పించి మా బిడ్డలు తెలుగు మీడియం లో చదువుతారు అని నిరాహారదీక్ష చెయ్యండి సార్.. అప్పుడు తెలుగు బతుకుద్దో లేదో చూద్దాం.. వాటి పర్యవసానాలు కూడ చూద్దాం...సార్ పాత కాలంలో అన్ని రోగాలకు పసరు వైద్యం ఉండే.. ఇప్పుడు సైన్సు అభివృద్ధి చెంది టానిక్ గోళీలు ఆపరేషన్ లు వచ్చాయి.. అలాగే ఈ చదువుల మార్పులు కూడాను... మీరు ఏమాత్రం తెలుగు చచ్చిపోతుంది అని చింతించవద్దు... ఏమి కాదు..ఇంకో పని చెయ్యొచ్చు కదా సార్..మీతోటి మిత్రులతో కలిసి ఇదే విషయం మీద ప్రతి జిల్లాలో కొన్ని పల్లెలు తిరిగి తల్లిదండ్రుల వివరణ కోరండి తెలిసిపోతుంది కదా...🙏🙏🙏
    Noorbasha Rahamthulla స్కూలుపెట్టు,నిరాహారదీక్ష చెయ్యి అని మాకు మీ సలహాలు అవసరంలేదు.మేము ఇంగ్లీషుమీడియంను వద్దు అనటంలేదు.మాకు తెలుగు మీడియం కూడా కావాలి.పసరు వైద్యం నుండి చాలా మారాము.సైన్సును అబివృద్ధిని అందరం ఆహ్వానించాలి.
    Vivek Reddy మరి మీరు ఏమి సాధిస్తారు సార్.. ముఖపుస్తకంలో పోస్టులు పెడితే ప్రభుత్వాలు మీ కోరికను తిరుస్తాయ... సరే చెయ్యండి ఎంతవరకు మీరు సఫలీకృతులు అవ్వుతారో చూద్దాం..
    Noorbasha Rahamthulla సాధింపులు బెదిరింపులు నా బాటకాదు.ఆలోచన ముఖ్యం.నిరాశ పనికిరాదు.చెప్పాల్సింది చెప్పాలి.మన కోరిక ప్రభుత్వమే తీర్చాలి.
    Vivek Reddy ప్రజల కోరికను ప్రభుత్వాలు తీరుస్తాయి కానీ... ఎదో పది మంది అడిగితే తీర్చవ్ సార్...
    Noorbasha Rahamthulla ప్రజలలో మాదీ ఒక భాగం.తీర్చేదాకా అడగుతాము.అడగకూడని కోరికా ఇది ?
    Vivek Reddy సరే బాగుంది సార్.. మీ మనవళ్ళను, మనవరాళ్లను తెలుగు మీడియం లో చేర్పిస్తారా సార్... ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం లో చదుతున్నార సార్ పిల్లలు...
    Noorbasha Rahamthulla తెలుగు మీడియం చదువుకు ఉద్యోగాలు ఇప్పిస్తారా?ఇప్పించమనే కోరుతున్నాం.బాగుచేసే ఆలోచన చేయండి ఎత్తివేయటం ఎందుకు? ఇష్టపడే వాళ్ళ ఆప్షన్ తీసేయవచ్చా?

    రిప్లయితొలగించండి
  2. Noorbasha Rahamthulla https://www.facebook.com/100021580033816/posts/511571396238857/
    Vivek Reddy సార్ నేను అడిగేది మీ పిల్లలు ఎక్కడ చదివారు ఇప్పుడు ఎక్కడ చదువుతున్నారు.... ఇది నేనడిగేది.. ఎవరో ఊకదంపుడు విన్యాసాలు ఉపన్యాసాలు నా నీకెందుకు సార్.. సూటి ప్రశ్న
    Vivek Reddy ఎందుకంటే మీరు తెలుగు సచ్చిపోతుంది అంటున్నారు కదా.. మీ పిల్లల స్కూల్లో తెలుగు చెప్పట్లేదా.. చెప్పనట్లయితే మీరు మీ పిల్లల్ని ఎందుకు ఇంగ్లీషు మీడియంలో చదివిస్తున్నారు.. ఇది ప్రశ్న సార్
    Noorbasha Rahamthulla చంపితే చచ్చిపోదా?ఉద్యోగం కోసమే అని చెప్పినా అదే ప్రశ్న .బాగు చేసే ప్లానులేమన్నా ఉన్నాయా?
    Vivek Reddy ఇదే ప్రైవేట్ స్కూల్ ఇంగ్లీష్ నడిపినప్పుడు తెలుగు సచ్చిపోదు.. ఇదే ప్రైవేట్ స్కూల్లో మన పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవొచ్చు.. పేదవాడి పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవకూడదు అంటారు.. మన పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివితే ఉద్యోగం కోసం.. అదే పేదవాడి పిల్లలు ఉద్యోగం కోసం ఇంగ్లీష్ మీడియం చదవొద్దు... బలే గమ్మత్తుగా ఉంది సార్ మీ వాదన....ఇంకో విషయం ఎవరు కూడ తెలుగును చంపలేదు.... మీరేదో బూచి ని చూపెట్టి అదిగో దెయ్యం అంటున్నారే కానీ.. ఒక్కసారి భయపడకుండా వెళ్లి చూసి వస్తే తెలుస్తుంది మీరు చెప్పే దెయ్యం ఉందొ లేదో..మీ పిల్లలు కు తెలుగు వస్తే మిగతా పిల్లలకు కూడా తెలుగు రాయడం చదవడం మాట్లాడ్డం అన్ని వస్తాయి...చివరకారుకు మీ పిల్లలు చదివేది ఇంగ్లీష్ మీడియం అని మీరు ఒప్పుకున్నారు.. అదే అదే ఉద్యోగం కోసం ఇంగ్లీష్ మీడియం స్కూల్..బాగు చెయ్యడానికి అసలు తెలుగు సచ్చిపోతేనే కదా...
    Noorbasha Rahamthulla తెలుగులో చదివితే ఉద్యోగాలు రానప్పుడు ఏమి చెయ్యాలి?ఉద్యోగాలు వస్తే మేము తెలుగే చదివిస్తాము.తెలుగు చదువుకు ఉద్యోగాలు లేవు.ప్రభుత్వం ఇవ్వలేదు. గత్యంతరం లేకే ఇంగ్లీషు మీడియం.ఉద్యోగాలు ఇవ్వలేము ఇంగ్లీషు తప్పదు అని ప్రభుత్వమే అంటుంటే తెలుగు లో ఉద్యోగాలిచ్చి తెలుగును కూడా కాపాడండి అనటం కూడా తప్పేనా?మీ పిల్లలు చదవనప్పుడు అసలు తెలుగు ఎందుకు అంటారా?విద్యార్ధుల సంఖ్య 30 శాతానికి పడిపోతే ఆ భాష చచ్చిపోతుంది అని ఐరాస చెప్పింది. ఉద్యోగాలు కల్పించే బాధ్యతను ప్రభుత్వం తీసుకోకపోతే తెలుగు ఎందుకు చదవాలనే మేముకూడా అడుగుతున్నాము.
    Vivek Reddy సారు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి.. ఇప్పుడు దేశం మొత్తం మీద విదేశీ కంపెనీలు వచ్చాయి.. వారికి అర్థం అయ్యే భాషలోనే మనం పని చేసిపెట్టాలి... ఆ భాషే ఇంగ్లీష్... మీకు తెలియంది కాదు ఒక పెద్ద ఉద్యోగం నుంచి వచ్చారు.. మీరు ఉద్యోగాలు చేసేటప్పుడే ఈ కంపెనీ లు వచ్చి ఉంటాయి.. మీరు అప్పుడే ఇంగ్లీష్ కంపెనీలు వద్దు తెలుగు కంపెనీ లు మాత్రమే ఉండాలి అని మీలాంటి బ్యూరోక్రాట్స్ ఖండించి ఉంటే ఈరోజు ఈ దుస్థితి వచ్చేది కాదు.. ఇంకా మాట్లాడు కోవాలి అంటే మన తెలుగు వారికి తెలివి చాలా ఎక్కువ..కానీ మనం స్వార్థం కోసం ఇంగ్లీష్ వానికి పని చేసి పెట్టి..వారు ఇప్పుడు మనమిదే ఆధారపడి నడుపుతున్నప్పుడు మనవారు కూడ డబ్బుల కోసం పనిచేశారు.. తప్పదు...అలాగని తల్లితండ్రులు కూడ ఎంత మంది బిడ్డల భవిష్యత్ మాటున అమెరికా అనే బూచి చూపించి విదేశాలకు తరుముతున్నారు... ఆ తరుణంలో తెలుగు ఉద్యోగాలు వెనుకపడి పోయాయి.ఇప్పుడు మీరు తెలుగు కావాలి అన్నగాని..నేను ఇంగ్లీష్ కావాలి అన్నగాని.. భవిష్యత్ కోసం ఇంగ్లీష్ వాడకం తప్పదు..దానిని తప్పించడం ఎవరి తరం కాదు.. కాబట్టి కాలంతో పోటీ పడి ప్రపంచంలో బ్రతకాలి అంటే ఇంగ్లీష్ తప్పదు సార్...
    తెలుగు చచ్చిపోతుంది అని మీరనుకొన్నత దుస్తుతి లేదు ఇంకా చెప్పాలి అంటే 100 మంది విద్యార్థుల్లో 50 మంది మాత్రమే ఇంగ్లీష్ మాట్లాడే ఉద్యోగాల్లో పోతారు మిగతా 50 మంది మిగులుతారు సార్.. మీరన్నటు 30%కాదు 50% జనం ఉన్నారు ..వారు తెలుగును బ్రతిస్తారు సార్.

    రిప్లయితొలగించండి
  3. Noorbasha Rahamthulla ఆహారము ఉపాధి కలుగజేసే ఇంగ్లీషును కాదని మేము అనటంలేదు.తెలుగు చచ్చిపోదని ఐరాస వాళ్ళకు చెప్పండి.నేను కోరేది తెలుగు ద్వారా ఏమన్నా ఉపాధి కల్పించే అవకాశం ఉందా అనే.
    Vivek Reddy ఐరాస అనే సంస్థ ఏ కొలమానం ఆధారంగా తెలుగు చచ్చిపోతుంది అని చెప్తుంది.. పోనీ ప్రభుత్వాలు ఎలా చెప్తాయి తెలుగు బ్రతికి ఉంది అని.. వాళ్లకు చెప్పినవన్నీ నిజాలే నా సార్...ఇక తెలుగు ద్వారా ఉపాద... చెయ్యొచ్చు... తెలుగు మీడియం స్కూల్ పెట్టి చదువు చెప్పొచ్చు.. కానీ ఇప్పుడు కాదు ఇంకో వందేళ్ల తరువాత.. అప్పటికీ మనం ఉండం.. మనం లేనప్పుడు ప్రపంచం తో మనకేం పని..😜😜😜 చూస్తా ఉండాలి... మీరు రాజు కాదు నేను మంత్రి కాదు మనం అనుకున్నవి జరగడానికి🙏
    Noorbasha Rahamthulla మీరు పిల్లల్ని కనండి ఉద్యోగాలిస్తాము అంటే నమ్మామా మనం?ఇవ్వలేని మాటలు జనము నమ్మరు.రాజులకు మంత్రులకు ఉపాధి ఆలోచన వస్తే మంచిదే.ఇంకా చూసే ఓపిక జనానికి లేదు🙏

    రిప్లయితొలగించండి