27, ఏప్రిల్ 2018, శుక్రవారం

తేట తెలుగులో పాలనకోసం బాటలువేద్దాం - శ్రీరాము సత్యనారాయణ కలక్టర్ కర్నూలు



S.Satyanarayana,I.A.S.

Collector & District Magistrate,
Kurnool District.
Office of the
Dist. Collector,
Kurnool District.



Phone : Office : 08518 - 220396, Resi. : 220006, 220131, Fax : Resi. : 08518 - 221914
E-mail: collector krnl@ap.gov.in

తేట తెలుగులో పాలన కోసం బాటలు వేద్దాం

విశ్వకవి శ్రీ రవీంద్రనాథ్ టాగూర్ మనసులోని భావాలను స్వేచ్ఛగా, స్వచ్ఛంగా వ్యక్తం చేసేందుకు మాతృ భాషే, మహాత్తరమైన వాహకం అన్నారు. ఏ విషయాన్నైనా మనం మాతృ బాషలో అర్ధం చేసుకున్నంత సులువుగా పరాయి భాషలో అర్ధం చేసుకోలేమన్నది నిర్వివాదాంశం. పుడమి పొరను తొలుచుకొని మొలుచుకొచ్చే మొగ్గలాగా మాతృ బాషలో మన భావాలు సహజంగా ఉబికివస్తాయి. చెరువు గట్టున నిలబడి చల్లని గాలిని పారవశ్యంతో అనుభవించినట్లు, చెరకు గడను నమిలి తీయందనాన్ని అస్వాదించినట్లు, మాతృ బాషలోని భావాన్ని సులభంగా, అవలీలగా అర్ధం చేసుకోవచ్చు. నారికేళ పాకం కన్నా, పంచదార మాధుర్యం కన్నా తేట తెనుగు తీయదనం మిన్న. తన మాతృ బాష తెలుగు కాకాపోయీనా సాహితీసమరాంగణ సార్వభౌముడిగా గణతికెక్కిన శ్రీ కృష్ణదేవరాయలు తెలుగు పై అపారమైన తృష్ణగలిగి తెలుగు బాషను తెలుగు తల్లి సిగలో నందివర్ధనమై వర్దిల్లేటట్లు చేశారు. అష్టదిగ్గజ కవులతో భువన విజయమును ఏర్పాటుచేసి తెలుగు బాషా వైభవాన్ని దశదిశలా చాటారు. తెలుగేతరులు తెలుగు భాషకు చేసిన సేవను స్మరిస్తున్నపుడు మనం తప్పనిసరిగా పేర్కొనదగిన మహనీయుడు సి.పి.బ్రౌన్ తెలుగు మాధుర్యానికి ముగ్ధుడై తెలుగును అమితంగా ప్రేమించిన బ్రౌన్ గారు బ్రౌణ్యనిఘంటువును రూపొందించడం, ప్రజాకవి వేమన పద్యాలను ఆంగ్లం లోనికి అనువదించి ప్రపంచానికి పరిచయం చేయడం తెలుగు భాషకు జరిగిన అరుదైన సత్కారంగా భావించాలి. తెలుగేతరులు చాలా మంది తెలుగు బాష అనే మందార మొక్కకు నీరుపోసి అనేక కావ్యమందారాలు పూయించి ఆంధ్రావనిని సుందర బృందావనిగా తీర్చిదిద్దారు. అటువంటి సుందర బృందావనిలో ప్రబంధ కావ్యసుమాలు, ద్వని కావ్య సుమదళాలు, ఆద్యాత్మిక కావ్య పుష్పాలు, ఎన్నెనో గుబాళించి తెలుగు బాషను పరిపుష్టం చేశాయి. ఇంతటి పవిత్రమైన తులసి మొక్కల సరసన పరబాషా గంజాయి మొక్కలు పెరగడం దురదృష్టకరం.

 నూర్ బాషా రహంతుల్లా మాతృభాష తెలుగు.ఆయన తెలుగు ముస్లిం. ఆయన తెలుగు భాషలో నూర్ (వెలుగు ) పెంచడం కొరకు, పంచడం కొరకు అనునిత్యం కృషిచేయడం అభినందనీయం. 1988లో అప్పటి ఆంధ్ర ప్రదేశ్ సచివాలయం తనకు రాసిన తెలుగు ఉత్తరాన్ని ఆయన భద్రపరిచి దానిని తెలుగులో పాలనకు అత్యుత్తమ ఉదాహరణగా ఉటంకించడం తెలుగు అములు పై ఆయనకున్న చిత్తశుద్దిని చాటి చెబుతుంది. దాదాపు మూడు దశాబ్దాలుగా అయన తెలుగును పాలనా భాషగా అమలు చేయించడం కోసం అపారమైన కృషి చేస్తున్నారు. కార్యాలయాలలోని దస్త్రాలు తెలుగులోనే రూపొందిస్తే ప్రభుత్వ ఆదేశాలను ప్రజలు సులభంగా అర్ధం చేసుకునేందుకు మార్గం సుగమమవుతుంది. దస్త్రం తెలుగు లో ఉంటేనే సంతకం చేస్తానని అలనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చెప్పినట్లు పాలకులందరూ పట్టుబట్టి ఒక తపస్సులాగా చిత్తశుద్ధితో అమలు చేస్తే తెలుగులో పాలన సాధ్యమవుతుంది.
ప్రస్తుతం ఆంగ్లంలో రూపొందుతున్న కార్యవర్తనములలోని పదాలను తెలుగులో రూపొందిస్తూ ఒక నిఘంటువును తయారుచేసి అంతర్జాలంలో అందుబాటులో ఉంచినట్లయితే దస్ట్రాలు  రూపొందించే వారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. తెలుగులో దస్తాలు రూపొందించడం పై ఉద్యగులందరికి తరచుగా శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటుచేయడం అత్యవసరం.
పల్లెసీమల్లో నివసిస్తున్న సామాన్య ప్రజలే నేడు తెలుగు భాషను బ్రతికించుకుంటున్నారు. పట్టణాలు, నగరాలలో పెరుగుతున్న అంగ్లమాధ్యమ వ్యామోహం తెలుగు ప్రాధాన్యతను తగ్గిస్తుంది. ఈ వైఖరిని అంతమొందించి భావితరాల వారికి తెలుగు భాష పట్ల ఆసక్తిని పెంపొందించాల్సిన ఆవశ్యకత ఉంది. రాష్ట్ర ప్రభుత్వం 2018 సంవత్సరాన్ని తెలుగుభాషా సంవత్సరంగా ప్రకటించింది. ఈ సంవత్సరంలోనే తెలుగు పాలనా భాషగా పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు అందరం కంకణ బద్దులమవుదాం. మనతేట తెలుగులో పాలన కోసం బాటలు వేద్దాం !.
                                                       శ్రీరాము సత్యనారాయణ
సర్వోన్నతాధికారి,     
కర్నూలు జిల్లా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి