30, ఏప్రిల్ 2018, సోమవారం

ప్రబోధానంద స్వామి గారి సందేశం

తెలుగులో పాలన పుస్తకం పై ప్రబోధానంద స్వామి గారి ఉద్దేశ్యము
ఉన్నత ఉద్యోగములో పని చేయుచున్న రహంతుల్లాగారు తెలుగు భాషపట్ల తనకున్న అభిమానమును తెలియజేస్తూ, తెలుగు భాష పతనమును గురించి ఒక ప్రక్క ఆవేదనను తెలియజేస్తూ, మరో ప్రక్క తెలుగు భాష అభివృద్దికి తన సూచనలు తెలియజేస్తూ, వార్తాపత్రికలలో అనేక వ్యాసములను వ్రాశారు.ఈయన తెలుగు ముస్లిం.తెలుగే ఆయన మాతృభాష. ఆయన తెలుగు భాషపట్ల తెలిపిన అభిప్రాయములన్నియు అక్షర సత్యములు. నిత్యము మనముందర కనిపించుచున్న యదార్థములు, అయినా రహంతుల్లాగారు చెప్పేంతవరకు నేను కూడా అంత లోతుగా గమనించలేదని చెప్పుచున్నాను. తెలుగు భాష రహంతుల్లాగారు గారు చెప్పినట్లు ప్రజలలోనే కాక, ప్రభుత్వములో కూడా ఆదరణకు దూరముగా యున్నదని కనిపించుచున్నది. తొమ్మిది కోట్లమంది తెలుగు భాషను వాడుచున్నా, భాషను సంపూర్ణ అవగాహనతో వాడలేదని తెలియుచున్నది. ఉదాహరణకు ఒక వ్యక్తి ఇలా అంటున్నాడు. నేను బాత్ రూమ్ పోతున్నాను' ఆ మాటను వినేవారికి అర్థమయినా అది సంపూర్ణ వాక్యముగా లేదు. ఆ మాటను చెప్పవలసిన రీతిలో చెప్పలేదు. నేను బాత్రూమ్ కు పోతున్నాను అని చెప్పితే అది సరియైన వాక్యమగును. రూమ్ అను పదము ప్రక్కన 'కు' అను అక్షరము లేనిదానివలన తెలుగు భాషను సగము చంపి వాడినట్లగుచున్నది. అలాగే “ఙ్ఞానము తెలిస్తే మనము మోక్షమునకు పోతాము” అను వాక్యమును చూస్తే జ్ఞానముకు మనము తెలిస్తే మోక్షానికి పోతామా? మనకు జ్ఞానము తెలిస్తే మోక్షానికి పోతామా? అని అనుమానము రాకతప్పదు. ఈ విధముగా తెలుగు భాష తెలుగు వారి మధ్యలో యున్నా అది కొంత అనారోగ్యముతో బ్రతుకుచున్నదని తెలియుచున్నది. ఏది ఏమయినా నూర్ భాషా రహంతుల్లాగారు వ్రాసిన వ్యాసములను చూస్తే 'పవర్ తగ్గిన బ్యాటరికీ తిరిగి చార్జింగ్ పెట్టినట్లు అయినది. ఆయన వ్యాసములను చదివిన ఎవరయినా తెలుగు భాషపట్ల కనువిప్పు పొందవలసిందే. ఎంతమంది మాట్లాడుతున్నారను విషయమును గుర్తు చేయుచూ, 25 భాషలను ఆరుకోట్ల వరకు మాట్లాడుతున్నారనీ తెలుపడము అభినందనీయము. అంతేకాక ఏ భాష, ఏ భాష చేతిలో కలిసిపోయి అంతరించి పోవుచున్నదో, అటువంటి 17 భాషలను గురించి తెలియజేసిన విషయము ఈ గ్రంథములో మీరు చూడవచ్చును. ముఖ్యముగా ఈ రెండు వ్యాసములను చూచిన తర్వాత అంతో ఇంతో తెలుగు భాష అభిమానినయిన నాకే ఆశ్చర్యమయినది. వాస్తవముగా నాకు గానీ, ఇతరులకుగానీ తెలియని విషయములను తెలిపిన నూర్ భాషా రహంతుల్లా గారిని అభినందించక తప్పదు. “వ్యాసము“ అను పదము అచ్చమయిన తెలుగు పదము. ఐదువేల సంవత్సరముల పూర్వము వ్యాసములను కూర్చి వేదములను వ్రాసిన ఆయన పేరును వేదవ్యాసుడు అని పిలిచారంటే, ఆ దినములలో ఆ ప్రాంతములో తెలుగు భాష వాడుకలో ఉండేదని అర్థమగుచున్నది. వేదములను, తర్వాత భగవద్గీతను సంస్కృత భాషలో హిందీ లిపితో వ్రాసినా, అది వ్యాసుడు తనవాడుక భాషలో వ్రాసేదానికంటే కొందరికి మాత్రమే తెలిసిన భాషలో వ్రాస్తే తనకు విలువయుంటుందని తలచి అలా వ్రాశాడని అర్థమగుచున్నది. తర్వాత గతించిన కాలములో తెలుగు కుంచించుక పోవడము, హిందీ వ్యాపించుక పోవడము జరిగినది. వంద సంవత్సరములప్పుడు అటు చెన్నపట్నము వరకు ఇటు బళ్ళారి వరకు వ్యాపించిన తెలుగు, నేడు ఒకవైపు దాదాపు 200 కిలోమీటర్లు జరిగి పుత్తూరు వరకు వచ్చినది. రెండవ వైపు 30 కిలోమీటర్ల వరకు వచ్చినది. తెలుగు భాషలో 'చెన్నపట్నము' అను పిలువబడుచున్న పేరు నేడు 'చెన్నై' అని పిలువబడుచున్నది. ఈ విధముగా పదివేల సంవత్సరముల పూర్వము భారతదేశములోనే కాక, శ్రీలంకలో కూడా తెలుగు ఉండేది. దానికి సాక్ష్యముగా నేటికీ కొన్ని ప్రాంతములలో తెలుగువారుంటూ తమ మాతృభాషను ఇల్లలో మాట్లాడుకొనుచున్నారు. వీరి పూర్వీకులందరూ లంకవారే అయివుండడము వలన పూర్వము లంకలో తెలుగు ఉండేదని తెలియుచున్నది. నేడు కాళ్లు విరిగి ఒక్క ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలలో మాత్రమే కనిపించు తెలుగు, సృష్ట్యాదిలో ప్రపంచ వ్యాప్తముగా ఉండేదని గతములో మేమే చెప్పియున్నాము. ప్రస్తుత కాలములో కొంత ప్రాంతమునకు, కొంతమందికే పరిమితమైన తెలుగు భాష భవిష్యత్తులో అంతరించిపోతుందన్న భయము కొందరిలో ఉన్నా, అది సంభవించదని మనిషిలో దైవము మీద విశ్వాసమున్నంతవరకు తెలుగు బ్రతికియుంటుందని చెప్పక తప్పదు. ఎందుకనగా! ఆధ్యాత్మికమంతయూ తెలుగు భాషతో ముడివేయబడియున్నది. మొదట ఆధ్యాత్మికము తెలుగు భాషలోనే పుట్టింది. తర్వాత తెలుగు భాషలోనే బ్రతుకుచున్నది. అందువలన దేవుడు శాశ్వితమే, తెలుగు శాశ్వితమే.. ప్రబోధానంద యోగీశ్వరులు ప్రబోధాశ్రమం,చినపొడమల,తాడిపత్రి

1 కామెంట్‌: